వీటి రేట్లు మళ్లీ పెంపు: తడిచి మోపెడు
సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి. పెరగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. కిలోకు రెండు రూపాయల మేర పెరిగింది. దీంతో సీఎన్జీ వినియోగదారులకు అదనపు మొత్తాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ధరలను సవరిస్తూ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దేశీయ పైప్డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలు స్టాండర్డ్ క్యూబిక్ మీటర్కు 50 పైసలు పెరుగుతాయి. ఈ పెంపు ఆటో రిక్షా, టాక్సీ సంఘాల నుండి ఛార్జీల సవరణ డిమాండ్లకు దారితీసింది.
తాజా సవరణతో సీఎన్జీ రిటైల్ ధర కిలోకు 84 నుండి 86 రూపాయలకు చేరింది. ముంబై, థానే, నవీ ముంబై సహా మహానగర్ గ్యాస్ లిమిటెడ్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాలపైనా దీని ప్రభావం పడింది. ఈ పెంపుదల సీఎన్జీకి మాత్రమే పరిమితం కాలేదు. పీఎన్జీ రేట్లు కూడా పెరగడానికి కారణమైంది. పీఎన్జీ ధర ఒక్కో ఎస్సీఎమ్కు 52 రూపాయలకు పెరుగుతుంది.

ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో 12 లక్షల సీఎన్జీ వాహనాలు, 2.8 లక్షల ఆటో రిక్షాలను ప్రభావితం చేస్తుంది. వరుస ధరల పెంపునకు గ్యాస్ సేకరణ ఖర్చులు గణనీయంగా పెరగడమే కారణమని మహానగర్ గ్యాస్ లిమిటెడ్ తెలిపింది. దేశీయ గ్యాస్ కేటాయింపులు తగ్గడం, అధిక వ్యయంతో కూడిన వనరులపై ఆధారపడటం, రూపాయి విలువ క్షీణించడం వల్ల మొత్తం గ్యాస్ ధర పెరిగిందని వివరించింది. దేశీయంగా గ్యాస్ లభ్యత తగ్గడంతో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొంది.
ఈ తాజా పెంపుతో ఆటో రిక్షా, టాక్సీ సంఘాలు ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తోన్నాయి. ముంబై రిక్షామెన్ యూనియన్ నాయకుడు థాంపీ కురియన్ మాట్లాడుతూ ఇంధన ధరల పెరుగుదలను బట్టి ఫార్ములా ప్రకారం బేస్ ఛార్జీపై కిలోమీటర్కు ఇప్పుడు ప్రయాణికులు చెల్లిస్తోన్న ధరలు ఏ మాత్రం చాలట్లేదని అన్నారు. ఈ పెరిగిన ఇంధన ఖర్చులను పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన డ్రైవర్లు ఏ మాత్రం భరించలేరని అన్నారు.
టాక్సీ యూనియన్లు సైతం కనీస ఛార్జీలో కనీసం మూడు రూపాయల మేర పెంపును డిమాండ్ చేశాయి. రవాణా శాఖ ఈ ప్రతిపాదనను ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పంపించాయి. పెట్రోల్, డీజిల్ తో పోల్చుకుంటే నేచురల్ కంప్రెస్డ్ గ్యాస్ ఇప్పటికీ పొదుపైన ఇంధనమేనని, పెట్రోల్తో పోలిస్తే సీఎన్జీ 45 శాతం, డీజిల్తో 12 శాతం మేర ఆదా చేస్తుందని మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications