సాయంత్రం గవర్నర్ తో జగన్ భేటీ: మంత్రుల రాజీనామా, కేబినెట్ విస్తరణ, రాజధాని బిల్లులే అజెండా..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో గవర్నర్ హరిచందన్ తో సీఎం జగన్ ఇవాళ భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత జగన్ గవర్నర్ తో భేటీ అవుతారు. ఈ భేటీలో కేబినెట్ విస్తరణ, రాజధాని బిల్లులతో పాటు అసెంబ్లీ సమావేశాల తీరు, బడ్జెట్ వంటి అంశాలు చర్చకు రానున్నాయి. కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వారి రాజీనామాలను కూడా సీఎం గవర్నర్ కు అందజేసే అవకాశముంది.
గవర్నర్ తో జగన్ భేటీ...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ వీడియో ప్రసంగం తర్వాత ఉభయసభలు ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించాయి. అయితే ప్రభుత్వం తరఫున గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం జగన్ ఇవాళ ఆయనతో సమావేశం కానున్నారు. సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లి సీఎం.. గవర్నర్ తో సమావేశం కాబోతున్నారు. ఇందులో పలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల తీరుతో పాటు రాజధాని బిల్లుల వ్యవహారం కూడా కీలకం కానుంది.
రాజధాని బిల్లులు ఆమోదం...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం అసెంబ్లీలో రెండుసార్లు సీఆర్డీయే, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించింది. వీటిని తొలిసారి మండలి సెలక్ట్ కమిటీకి పంపినా కాలాతీతం అయిపోయింది. రెండోసారి మండలిలో బిల్లులు ప్రవేశపెట్టకుండానే టీడీపీ అడ్డుకుంది. ఇప్పటికీ టీడీపీ ఆ బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనను గవర్నర్ కు సీఎం జగన్ వివరించనున్నారు. రాజధాని బిల్లులను ఈసారి మనీ బిల్లులుగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో మండలి నిర్ణయాలతో వాటికి సంబంధం లేదనే అంశాన్ని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు.
మంత్రుల రాజీనామాలు, కేబినెట్ విస్తరణ...
రాజ్యసభకు తాజాగా ఎంపికైన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలను సీఎం జగన్ గవర్నర్ కు నేరుగా అందజేసే అవకాశముంది. వీరి రాజీనామాలు ఆమోదించడంతో పాటు వారి స్దానంలో మరో ఇద్దరిని తీసుకునేందుకు వీలుగా సీఎం జగన్ గవర్నర్ తో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇద్దరికి అవకాశం కల్పించడంతో పాటు మరికొన్ని మార్పుల కోసం కేబినెట్ విస్తరణ ముహుర్తం కూడా ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరు బీసీ మంత్రులు రాజీనామా చేయాల్సి రావడంతో వారి స్ధానాల్లో తిరిగి బీసీలకే అవకాశం ఇస్తారా లేకఇతర సామాజిక వర్గాకు చోటిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
అసెంబ్లీ నిర్వహణ తీరుపైనా...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలను కూడా సీఎం జగన్ గవర్నర్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ప్రభుత్వ బిల్లులను కూడా పట్టించుకోకుండా డిప్యూటీ ఛైర్మన్ టీడీపీ సభ్యుల వాదనకు ప్రాధాన్యమివ్వడం, ద్రవ్య బిల్లు కూడా ఆమోదం పొందకపోవడం, మండలిలో అసభ్య సన్నివేశాలు. వాగ్యుద్దాలపైనా సీఎం జగన్ గవర్నర్ కు వివరణ ఇవ్వబోతున్నారు. మండలిలో టీడీపీ సభ్యులు, డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారశైలిపైనా ఫిర్యాదు చేయనున్నారు.