మే 3న విశాఖకు సీఎం జగన్ - ఎన్నికల వేళ కీలకంగా..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ లో తాను విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి, మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందు కోసం మే 3 ముహూర్తంగా నిర్ణయించారు. విశాఖ పర్యటనకు ఆ రోజున రానున్న సీఎం జగన్ రెండు కీలక ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి భూమి పూజ చేసే ప్రాజెక్టుల గురించి మంత్రులు బుగ్గన..అమర్నాధ్ విశాఖ కేంద్రంగా వెల్లడించారు.
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. నైపుణ్యం గల యువతను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహజ వనరుల నిలయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.

మే 3న అదానీ డేటా సెంటర్కు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.5 వేల కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులకు మే 3న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఒకేసారి 22 విమానాలు ఆగేలా..ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా నిర్మాణం ఉంటుందని వివరించారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న భోగాపురం విమానాశ్రయాన్ని 24 నెలల్ల అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతలను పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జీఎంఆర్ గ్రూప్ చేపట్టిందని చెప్పారు. మొత్తం మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణించేలా రూ.5,000 కోట్లతో పనులు చేపడతారు.
ఇక రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు. 2025 నాటికి తొలి విమానం బయల్దేరేలా ప్రణాళికలు సిద్దం చేసారు. విశాఖ నుంచి భోగాపురం వరకు ఆరు లేన్ల రహదారి ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం ఖరారైంది. విశాఖ కేంద్రంగా భోగాపురం విమానాశ్రాయం, ఆదానీ డేటా సెంటర్ తో పాటుగా ముఖ్యమంత్రి మరిన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications