26న తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో తదుపరి విడత నిధుల జమకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 26న శింగనమల నియోజకవర్గం నార్పల వేదికగా ఈ నిధులు విడుదల చేయనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం (ఏప్రిల్ 17) ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు కార్యక్రమం వాయిదా పడింది. దీంతో, 26న ముఖ్యమంత్రి పాల్గొనే సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు కార్యాచరణ ఫిక్స్ చేసారు.
ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం పథకాలను అమలు చేస్తున్నారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అభ్యసించే వారికి రూ. 20 వేల వరకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది. ఈ పథకం కింద నిధుల విడుదలకు ఈనెల 26న అనంతపురం జిల్లా నార్పల పర్యటనకు వెళ్లనున్నట్టుగా సీఎంవో అధికారులు తెలిపారు. అదే సమయంలో అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.

వసతి దీవెన పథకానికి పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదివేవారు అర్హులు. డే స్కాలర్, కాలేజ్ అటాచ్ హాస్టల్స్, డిపార్ట్మెంట్ అటాచ్ హాస్టల్స్లో ఉండే విద్యార్థులకు అవకాశం ఉంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఇక, రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో కీలకమైన అనంతపురం జిల్లా వేదికగా సీఎం జగన్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ తొలి సారిగా రాయలసీమ ప్రాంతానికి వస్తున్నారు. దీంతో, రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications