సీఎం జగన్ కొత్త స్కెచ్- కొడాలి నాని స్థానంలో : ఆ ఇద్దరిలో ఒకరు - బైపోల్ : టార్గెట్ చంద్రబాబు..!!
2024 ఎన్నికల కోసం సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే ఆలోచనలకు పదును పెడుతున్నారు. మంత్రివర్గ ప్రక్షాళనకు సీఎం కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుత కేబినెట్ లో ఇద్దరు మినహా మిలిగిన వారిని తప్పించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వారి స్థానంలో సామాజిక సమీకరణాలు..సమర్ధత ఆధారంగా కొత్త వారి ఎంపిక కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీని టార్గెట్ చేయటంతో పాటుగా.. చంద్రబాబును రాజకీయంగా ఆత్మరక్షణలో పడేయలగల సమర్ధత ఉన్న వారిని ఎంపికలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు కేబినెట్ లో కొడాలి నాని అవసరమైన ప్రతీ సందర్బంలోనూ చంద్రబాబు ను టార్గెట్ చేయటంలో ముందు నిలిచారు.
కొడాలి నాని స్థానంలో కొత్తగా..
ఇప్పుడు విస్తరణ సమయంలో పాలసీ నిర్ణయంలో భాగంగా మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ పదవి కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..కొడాలి నాని స్థానాన్ని కమ్మ వర్గం నుంచి ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోంది. అయితే, పార్టీలో ముఖ్య నేతల మధ్య కొత్త సమీకరణం దిశగా చర్చ సాగుతోంది.
కొడాలి నాని స్థానంలో కేబినెట్ లో క్రిష్ణా జిల్లా నుంచి వసంత క్రిష్ణప్రసాద్.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం కు అవకాశం దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త చర్చలో భాగంగా.. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ .. కరణం బలరాం పేర్ల పైన ఫోకస్ పెరిగింది. వంశీ ఇప్పటికే చంద్రబాబు లక్ష్యంగా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. కరణం బలరాం సైతం టీడీపీతో దూరంగా ఉంటున్నా..చీరాలలో వైసీపీ నుంచే మరో ఇద్దరు నేతల తో పోటీ ఎదుర్కొంటున్నారు.
ఆ ఇద్దరు నేతల పై కీలక చర్చ
అయితే, వీరిద్దరిలో ఒకరిని కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం పైన చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ లోకి తీసుకొనే ముందే వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవ్వాలనే భారీ నిర్ణయం పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికకు వెళ్లి విజయం సాధిస్తే..అమరావతి నిర్ణయంతో క్రిష్ణా - గుంటూరు జిల్లాల్లో వైసీపీకి రాజకీయంగా నష్టం తప్పదనే అంచనాలకు సమాధానం చెప్పటం ఒక లక్ష్యంగా కనిపిస్తోంది.
వంశీని కేబినెట్ లోకి తీసుకోవటం ద్వారా టీడీపీ బలమైన ప్రాంతాలుగా భావిస్తున్న ఏరియాల్లో ప్రభావం చూపించగలుగుతారని అంచనా వేస్తున్నారు. అదే విధంగా బలరాంకు అవకాశం ఇస్తే...టీడీపీకి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకొనే ప్రధాన సామాజిక వర్గంలో ప్రభావితం చేయగలుగుతారని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజీనామా చేయించి..క్యాబినెట్ లోకి
దీంతో పాటుగా.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను నేరుగా మంత్రులుగా చేయటం పైన వైసీపీ ఆందోళన చేసింది. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రచారం చేసింది. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. కేబినెట్ లోకి తీసుకోవటం ద్వారా చంద్రబాబు తరహాలో తాము వ్యవహరించమనే సంకేతాలు ఇవ్వాలనేది వైసీపీ మరో లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో గన్నవరం - చీరాల లో పరిస్థితుల పైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒకరికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందీ.. ప్రత్యేకించి..ఆ నియోజవకవర్గాల్లో ఏర్పడే పరిస్థితుల పైన సమీక్షిస్తున్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు - అమరావతి కి సమాధానంగా
ఇప్పటికే గన్నవరం - చీరాల లో వంశీ - బలరాంతో స్థానిక వైసీపీ నేతలు కలిసి ప్రయాణం చేయటానికి సిద్దపడటం లేదు. అయితే, జగన్ ఒక వర్గానికి వ్యతిరేకం అని చేస్తున్న ప్రచారానికి సమాధానం చెప్పటంతో పాటుగా.. పరధానంగా అమరావతి ప్రాంతంలో బలం నిరూపించుకోవటం.. టార్గెట్ చంద్రబాబు లక్ష్యంగా ధీటుగా టీడీపీని ఎదుర్కొనే వారికి కేబినెట్ లో ఈ సమీకరణంలో స్థానం కల్పించటం లక్ష్యమని చెబుతున్నారు.
అదే జరిగితే ఆత్మకూరుతో పాటుగానే బై పోల్ కు సిద్దం కావాల్సి ఉంటుంది. దీంతో..కొడాలి నాని స్థానం భర్తీ విషయంలో వైసీపీలో జరుగుతన్న చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. చివరకు సీఎం జగన్ ఈ స్థానం ఎవరితో భర్తీ చేస్తారు.. ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతుందనేది మరి కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.