తెలంగాణాను చూసైనా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వండి: కేసీఆర్ దెబ్బతో ఏపీలో నిరుద్యోగుల నిరసనలు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటన చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆందోళన బాట పట్టారు. సీఎం కేసీఆర్ తరహాలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల, ప్రతిపక్షాల ఆందోళన బాట
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో అన్ని ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు, నిరుద్యోగులు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనమండలి భవన్ దగ్గర నిరసన చేపట్టి ఆందోళన తెలియజేశారు. ఇక ఏపీ అసెంబ్లీలోనూ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై టిడిపి నేతలు తమ నిరసన గళం వినిపించారు.
టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్రంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఉందని పేర్కొంటూ, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 91000 ఖాళీలను భర్తీ చేయగలిగినప్పుడు ఏపీ ప్రభుత్వ ఎందుకు చేయలేక పోయింది అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో ఆందోళన చేపట్టిన నిరుద్యోగ జేఏసీ... అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లు
ఇదిలా ఉంటే తాజాగా ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యారు. జాబ్ నోటిఫికేషన్స్ విడుదల కోరుతూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి విజయవాడలో ధర్నా చేపట్టింది. తమ న్యాయమైన డిమాండ్ అయిన జాబ్ నోటిఫికేషన్ లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ నిరుద్యోగ సంఘాల నాయకులను, విద్యార్థి యువజన సంఘాల నాయకులను హౌస్ అరెస్టు చేశారు. పలువురిని పోలీసులు ముందస్తుగానే అరెస్టుల నిర్వహించారు.
జాబ్ నోటిఫికేషన్ లు అడిగితే జైల్లో పెడతారా : సీపీఐ రామకృష్ణ ఫైర్
ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వైసిపి ప్రభుత్వ తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ నోటిఫికేషన్ లు అడిగితే జైల్లో పెడతారా అంటూ ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీపీఐ రామకృష్ణ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఎన్నికల ప్రచార సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్ ఆశించిన యువతకు జగన్ సర్కార్ మొండి చెయ్యి
రాష్ట్రంలో కేవలం 66 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణమని, యువతకు ద్రోహం చేయడమేనని సిపిఐ రామకృష్ణ పేర్కొన్నారు. 2021 జూన్ 18న కేవలం 10,143 ఉద్యోగాలకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లిందని సిపిఐ నేత రామకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది సమగ్ర జాబ్ క్యాలెండర్ వస్తుందని ఆశించిన యువతకు జగన్ సర్కార్ మొండిచెయ్యి చూపించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జాబ్స్ నోటిఫికేషన్ విషయంలో జగన్ సర్కార్ సైలెంట్
ఇప్పటివరకు నిరుద్యోగులు ఎంతఫా ఆందోళనలు చేస్తున్నా ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జగన్ సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేస్తే అదనపు ఆర్థిక భారం పడుతుందన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.ప్రతి నెలా ఉద్యోగులకు ఇచ్చే జీతాల విషయంలోనే నానా అగచాట్లు పడుతున్న జగన్ సర్కార్, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా, వారి సమస్యల పరిష్కారం విషయంలో నోరు మెదపటం లేదు.జాబ్ నోటిఫికేషన్స్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయడం లేదు.