ఇక్కడే పుట్టాం, గీతారెడ్డి అర్థం చేసుకోవాలి: సిఎం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి శనివారం సమైక్యరాగం ఆలపించారు. తాము హైదరాబాదులోనే పుట్టి పెరిగామని, హైదరాబాదులోనే చదువుకున్నామని, అందుకే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. శ్రీసిటిలో ఆయన శనివారం పెప్సికో బేవరేజ్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల మంత్రి జె. గీతా రెడ్డి కూడా పాల్గొన్నారు.
తాము ఎందుకు కలిసి ఉండాలని కోరుకుంటున్నామో గీతా రెడ్డి వంటివాళ్లు అర్థం చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మాటలకు గీతారెడ్డితో పాటు తదితరులు నవ్వుకున్నారు. పరిశ్రమలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెప్సికో బేవరేజ్ ప్లాంటుకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన కేంద్రమని ఆయన అన్నారు. పెప్సీ కంపెనీ రూ. 1200 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటిలో ప్లాంట్ను నిర్మిస్తోంది. దానికి హైదరాబాదులో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు పరిశ్రమలపై ఏ విధమైన ప్రభావం చూపలేదని ఆయన అన్నారు. విద్యుత్ కొరత కారణంగా నిరుడు ఇబ్బంది ఏర్పడిందని, ప్రస్తుతం ఆ సమస్యలను అధిగమించామని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని శనివారం కొంత మంది విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని, అవినీతి రహిత పాలనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.