ఒకే దగ్గరికి చేరిన రేవంత్- కేటీఆర్.. వాట్ నెక్స్ట్?
Delimitation: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫెయిర్ డీలిమిటేషన్ (Fair delimitation) అనేది ఈ భేటీ ప్రధాన డిమాండ్.

జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉంటోన్నందున కాంగ్రెస్ దీనికి మద్దతు ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ కూటమితో వ్యతిరేకం కావడం వల్ల అటు భారత్ రాష్ట్ర సమితి ప్రాతినిథ్యం కూడా ఈ సమావేశంలో కనిపించింది.
మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి వేదికను పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రం వరకు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ- డీలిమిటేషన్ అనేది జాతీయ స్థాయి అంశం కావడం, బీజేపీ విధానాలను ఈ రెండు పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో వారిద్దరూ ఈ భేటీకి హాజరయ్యారు.
కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు - పినరయి విజయన్, భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్.. కొద్దిసేపటి కిందటే చెన్నైకి చేరుకున్నారు కూబా. డీఎంకే సమావేశానికి హాజరు కానున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈ భేటీకి తాను హాజరు కావట్లేదని, పార్టీ తరఫున డీకే హాజరవుతారంటూ ఇదివరకే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు స్టాలిన్కు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు కూడా ఆహ్వానం అందినప్పటికీ- ఆ పార్టీ ప్రాతినిథ్యం ఉండట్లేదు. ఇందులో పాల్గొనదలచుకోలేదు.
దక్షిణాదిన తెలుగుదేశం, జనసేన మినహా అన్ని పార్టీలు కూడా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరిని ఇక్కడ కూడా కొనసాగిస్తోంది. ఫలితంగా- ఈ సమావేశానికి ఏపీ నుంచి ప్రధాన పార్టీల ప్రాతినిథ్యం దాదాపుగా లేనట్టే.












Click it and Unblock the Notifications