సీఎం జగన్ మరో కీలక ప్రకటన.. ఇక ప్రతీ గ్రామంలో జనతా బజార్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 2021 చివరికల్లా ప్రతీ గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను సులభతరం చేసేందుకు.. రైతుల కష్టాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
గ్రామాల్లోనే కోల్డ్ స్టోరేజీ సదుపాయాలను కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
కాగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్' పథకం కింద నేడు అన్నదాతలకు నగదు బదిలీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఈసారి రాష్ట్రంలో 49.43 లక్షల కుటుంబాలకు పంట పెట్టుబడి సాయం అందనుంది. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది.ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు ప్రభుత్వం సాయం అందిస్తోంది.
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.13500 నగదు బదిలీ చేస్తున్నారు. 2019-2020 రబీ సీజన్ నుంచి రైతులకు ఈ సాయం అందుతోంది. ఈ ఏడాది గత నెలలో తొలి విడుత కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.875 కోట్లు జమ చేసింది. రెండో విడతగా ప్రతి రైతు కుటుంబానికి రూ. 7,500 నేడు బ్యాంకుల్లో జమ కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 2,900 కోట్లను విడుదల చేసింది.