కేరళకు వైఎస్ జగన్: సీఎం పినరయి విజయన్ సహా ఆ నేతలతో కీలక భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీగా ఉంటోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, ఇతర కారణాల వల్ల అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో అత్యధిక సమయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన ఆయన ఇక ప్రజల్లోకి వెళ్తోన్నారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. మొన్నటికి మొన్నే ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
ఆ తరువాత కృష్ణా జిల్లా పెడనలో పర్యటించారు. నాలుగో విడత నేతన్న నేస్తం నిధులను విడుదల చేశారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వేంపల్లి మండలం ఇడుపుల పాయలో గల వైఎస్సార్ ఘాట్ను సందర్శిస్తారు. తండ్రికి నివాళి అర్పిస్తారు. అనంతరం తన సొంత నియోజకవర్గం పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

ఆ మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 3వ తేదీన కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. రాజధాని తిరువనంతపురంలో నిర్వహించనున్న 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ భేటీని నిర్వహించనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనికి అధ్యక్షత వహించనున్నారు. కేరళతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల ముఖ్యమంత్రులు, లెప్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు దీనికి హాజరు కానున్నారు.
ముఖ్యమంత్రులు పినరయి విజయన్, వైఎస్ జగన్, కేసీఆర్, స్టాలిన్, బసవరాజ్ బొమ్మై, ఎన్ రంగసామి ఇందులో పాల్గొంటారు. రెండు రోజుల పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తిరుపతి ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా- ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలపై వైఎస్ జగన్ కసరత్తు మొదలు పెట్టారు.
ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, మున్సిపాలిటీలు, వ్యవసాయం, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications