ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసారు- ఆత్మీయంగా మళ్లీ ఇద్దరూ : కేసీఆర్ - జగన్ మాటా మంతీ..!!
ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇద్దరూ అత్మీయంగా మాట్లాడుకున్నారు. ఏకాంతంగా మంతనాలు సాగించారు. ఇందుకు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుక వేదిక అయింది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మీయంగా మెలిగారు. హైదరాబాద్ లో కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి జగన్, అదే విధంగా అమరావతిలో జగన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు.
జగన్ సీఎం అయిన తరువాత
ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాల రైతుల సాగునీటి సమస్య.. రాయలసీమ తాగు నీటి సమస్య పరిష్కారానికి గోదావరి నీటికి సీమకు తరలించే ప్రణాళికలు రూపొందించారు. అయితే, పోతిరెడ్డి పాడు పైన రెండు రాష్ట్రాల మధ్య మొదలైన నీటి వివాదంతో వారిద్దరూ కూడా దూరంగానే ఉంటున్నాు. ఇక, తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు పైన తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ షర్మిల తన పార్టీ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలు వివాహ వేడుకలో వీరిద్దరూ మరలా ఒకే చోట కలుసుకున్నారు.
చాలాకాలం తరువాత ఇద్దరూ ఆత్మీయంగా
తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. తరువాత ఏపీ సీఎం జగన్ అక్కడకు వచ్చారు. ఆయన నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లారు. కేసీఆర్ ఆయన్ను ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘంగా చర్చలు చేసారు. ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వధూ వరులను సైతం కలిసి ఆశీర్వదించారు. కలిసి ఫొటోలు దిగారు. అయితే, ఏపీ అసెంబ్లీలో తాజాగా జరిగిన పరిణామాలు.. చంద్రబాబు కన్నీరు అంశాల పైన వీరిద్దరూ మాట్లాడుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఢిల్లీ టూర్ అంశం పైనా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అయితే, ఇదే వేడుకలో ఏపీ స్పీకర్ తో పాటుగా రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు సైతం హాజరయ్యారు. ఇలా చాలా కాలం తరువాత తిరిగి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కలవటం.. మాట్లాడుకోవటం.. ఆత్మీయంగా మెలగటం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇద్దరూ కలిసిన అంశం వైరల్ అవుతోంది.