ఏపీలో కోడి కత్తి మరణాల కలకలం ! జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ కోర్టు విచారణ వేళ.. !
ఏపీలో కోడి కత్తి గురించి సంక్రాంతి కోడి పందాలు ఆడే వారికి మాత్రమే తెలుసు. కానీ వైఎస్ జగన్ పై మూడేళ్ల క్రితం వైజాగ్ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడితో అందరికీ తెలిసింది. కోడి కత్తితో దాడి చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుందనేది అర్ధమైంది. ఇప్పుడు దాని తీవ్రతను మరింతగా తెలియజేసేలా ఏపీలో కోడి కత్తుల దాడుల్లో రెండు నిండు ప్రాణాలు పోయాయి. సీఎం జగన్ పై జరిగిన కోడికత్తి దాడిపై ఎన్ఐఏ కోర్టు రెగ్యులర్ విచారణకు సిద్ధమవుతున్న వేళ ఈ రెండు మరణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కోడి కత్తికి ఇద్దరు బలి
ఏపీలో సంక్రాంతి పండుగను అంతా సంతోషంగా జరుపుకుంటున్న వేళ కోడి కత్తి కారణంగా ఇద్దరు బలైపోయారు. గోదావరి జిల్లాల్లో జరిగిన కోడి పందాల సందర్భంగా పందెం కోళ్ల కాళ్లకు కట్టిన కత్తులు ప్రమాదవశాత్తూ తగిలి ఇద్దరు వేర్వేరు చోట్ల ప్రాణాలు కోల్పోయారు. ఓ చోట పందాల బరిలోంచి కోడిపుంజు హఠాత్తుగా బరి దాటి బయటకు దూసుకురావడంతో దాని కాలికి కట్టిన కత్తి తగిలి పద్మరాజు అనే వ్యక్తి చనిపోతే, మరో చోట పందెం కోడికాలికి కత్తిని కడుతూ.. అది పొరబాటున తగలడంతో సురేష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు చోట్ల కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తూ కోడికత్తి తగిలి వీళ్లిద్దరూ చనిపోయారు. దీంతో కోడి కత్తి తీవ్రత మరోసారి చర్చనీయాంశమవుతోంది.

కోడి కత్తి తీవ్రత అర్ధమవుతోందా ?
గతంలో కోడి పందాల్లో పాల్గొనే వారికి, పందెం కాసే వారికి మాత్రమే కోడి కత్తి తీవ్రత గురించి తెలిసేది. కానీ ఇప్పుడు ఏకంగా అవే కోడికత్తులు తగిలి ఇద్దరు చనిపోవడంతో దాని తీవ్రత అందరికీ అర్ధమవుతోంది. ముఖ్యంగా కోడి కత్తికి మనుషుల ప్రాణాలు తీసేంత శక్తి ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా వందల సంఖ్యలో కోడి కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తయారీ దారుల్ని కట్టడి చేశారు. కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిషేధం. అలాంటిది ఈసారి అవే కోడికత్తులు కట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహారం మళ్లీ కోర్టుల వరకూ వెళ్లేలా కనిపిస్తోంది.

అప్పట్లో జగన్ పై దాడి వ్యవహారంలో
2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో కోడి కత్తి దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. విపక్ష నేతపై జరిగిన దాడిని లైట్ తీసుకోవడమే కాక వెంటనే డీజీపీతో ఇదంత పెద్ద దాడేమీ కాదనే ప్రకటనలు ఇప్పించింది. దీంతో కోడి కత్తి దాడి వ్యవహారం అప్పట్లో అధికార, విపక్షాల మధ్య తీవ్ర రచ్చకు కారణమైంది. ఆ తర్వాత ఈ కేసు ఎన్ఐఏ దర్యాప్తు వరకూ వెళ్లింది. ఇప్పటికీ ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉంది.

ఎన్ఐఏ కోర్టు రెగ్యులర్ విచారణ వేళ ?
వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తాజాగా స్పందించింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు మరోసారి బెయిల్ నిరాకరించడమే కాకుండా బాధితుడైన జగన్ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ఎన్ఐఏను ప్రశ్నించింది. అంతే కాదు బాధితుడైన జగన్ ను కూడా కోర్టుకు రప్పించి వాంగ్మూలం నమోదు చేయించాలని సూచించింది. ఈ నెల 31 నుంచి ఈ కేసులో రెగ్యులర్ విచారణకు ఎన్ఐఏ కోర్టు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో రెండు కోడి కత్తి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కచ్చితంగా ఈ కేసుపై ప్రభావం చూపబోతోంది. కోడి కత్తి దాడి ప్రాణాలు తీసే స్ధాయిలో ఉండటంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ పై అభియోగాలు రుజువైతే ఆయనకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలూ లేకపోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications