ఎపికి ఊరట: మెట్రో రైలు ప్రాజెక్టుకు రాయితీలు
న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖ మెట్రో రైలు నిర్మాణ పథకానికి కావాల్సిన ఆర్థిక వనరుల లభ్యతను సుగమం చేసే పద్ధతిలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక రాయితీ ప్రకటించారు. రెండు మార్గాల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికల తయారీ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ను సలహాదారుగా నియమించుకోవటానికి ఆంధ్రకు నిబంధనలు సడలించి అనుమతి మంజూరు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట లభించింది.
కేంద్రం అనుమతితో మెట్రో నిర్మాణానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి పొందటానికి వీలుపడుతుంది. విజయవాడ మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైల్వే ఇప్పటికే అందించింది. ఈ నివేదిక తయారీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది.

నియమ నిబంధనల ప్రకారం ఆంధ్రకు ప్రభుత్వ సలహాదారులను బిడ్డింగ్ ప్రక్రియలో ఎంపిక చేసుకోవాల్సి ఉండగా, నామినేషన్ పద్ధతిపై డిఎంఆర్సిని ఎంపిక చేసుకుంది. పట్టణాభివృద్ధి శాఖ నియమ నిబంధనలను సడలిస్తే తప్ప కేంద్ర సాయం అందే అవకాశాలు లేదు.
దాంతో కేంద్ర మంత్రి వెంకయ్య ఈమేరకు నియమ నిబంధనలను సడలించి ఆంధ్రకు సాయం లభించేలా చేశారు. డిఎంఆర్సి నిర్వహించే అధ్యయనం కోసమయ్యే ఖర్చులో యాభై శాతం పెట్టుబడి కేంద్రంనుంచి లభిస్తుంది.












Click it and Unblock the Notifications