మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ధర్నాపై గందరగోళం ... పోలీసుల భారీ భద్రత
చిరంజీవి మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంత రైతులు చిరంజీవి మీద ఆగ్రహంతో ఉన్నారు. ఇక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపాలని కోరుతూ అమరావతి యువసేన జేఏసీ నేడు ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక జేఏసీ దీక్ష చెయ్యాలని భావించినా కొంతమంది కులాలను ఆపాదిస్తూ కుల ప్రస్తావన తెచ్చి వక్రీకరించి ప్రచారం చేయడం పట్ల చింతిస్తూ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నామని ప్రకటించింది. అయినప్పటికీ నేడు చిరంజీవి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు .

నేడు చిరంజీవి ఇంటి వద్ద ధర్నా చెయ్యాలనుకున్న యువసేన జేఏసీ
హైదరాబాద్లోని చిరంజీవి ఇంటి ముందు నేడు ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం.ల వరకు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు అమరావతి యువసేన జేఏసీ పేర్కొంది. ఈ దీక్ష అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని చిరంజీవిని మర్యాదపూర్వకంగా కోరడానికి మాత్రమేనని, ఎలాంటి ఆందోళనలకు కాదని జేఏసీ తెలిపింది.చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు తెలిపారన్న బాధ తమకు ఉందని వారంటున్నారు .

రాజధాని అమరావతికి మద్దతు పలకాలనే ఉద్దేశం
ఆ బాధతో ఒకటే రాష్ట్రము, ఒకటే రాజధానికి, రైతుల త్యాగాలను గురించి వివరించి మద్దతు పలికేలా శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు. గతంలో మహేష్ బాబు, ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపినట్లే మెగాస్టార్ను కలిసి శాంతియుత మార్గంలో వివరించాలన్న సదుద్దేశంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నామని వారు పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి రైతుల త్యాగాలను గౌరవించి రైతుల పక్షాల నిలబడతారని ఆశిస్తున్నామని వారు చెప్పారు .

చిరంజీవి నివాసం వద్ద పోలీసుల భారీ బందోబస్తు
ఒక పక్క జేఏసీ ఈ ధర్నాకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీంతో గందరగోళం మధ్య మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు . ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే అమరావతి జేఏసీ నాయకులు చిరంజీవి నివాసం ముందు ధర్నాకు చేయనున్నారని సమాచారం అందడంతో పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది . చిరంజీవి నివాసం దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రానీకుండా ఆంక్షలు విధిస్తున్నారు.












Click it and Unblock the Notifications