తిరుపతిలో వైసీపీ విజయంపై సీఎం అనూహ్య స్పందన.!సోదరుడు గురుమూర్తికి అభినందనలన్న జగన్.!
తిరుపతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై స్పందించారు. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. 23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికలో ప్రజలు వైసీపి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే, ప్రభుత్వం చేసిన మంచిపనిని మనసారా దీవించి ఇవాళ మరింత మెజారిటీ ఇవ్వడం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
తిరుపతి విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేవుని దయ, అందరి చల్లని దీవెనలతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,65,988 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్సీపికి 6,11,1116 ఓట్లు పోలవగా, తెలుగుదేశం పార్టీకి 3,45,128 ఓట్లు వచ్చాయి.
ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. ఆ పార్టీ 56,035 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందారు. గతేడాది ఆయన కరోనాతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఓట్ల లెక్కింపు సగం పూర్తయ్యేవరకు అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తి, ప్రత్యర్థికి అందనంత మెజారిటీలో నిలిచి గెలపు సొంతం చేసుకున్నారు.