కేసుల భయంతోనే బీజేపీకి మద్దతు-వైసీపీ గుట్టు బయటపెడ్డిన కాంగ్రెస్- సాయిరెడ్డే కారణం..
సీఎంగా ఉన్న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తాను కోరిన విధంగా సీఎం పీఠం ఇవ్వలేదనే కోపంతో కాంగ్రెస్ను వీడి వైసీపీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన జగన్ను తమవైపు తిప్పుకునేందుకు అడపాదడపా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి శతృత్వం లేదని, గతంలో తనతో వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీని క్షమించేశానని కూడా జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్ధితే వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమని జగన్ అప్పట్లో చెప్పారు. కానీ పరిస్దితులు అనుకూలించక మరోసారి కేంద్రంలో ఎన్డీయే సర్కారు కొలువుదీరింది. తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగన్ను చేరదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతుండగా.. రాజ్యసభలో నిన్న చోటుచేసుకున్న పరిణామాలు దానికి అవకాశం లేకుండా చేశాయి.
కాంగ్రెస్-జగన్ బంధం..
కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్ జగన్ ఆ పార్టీతో పనిచేసింది తక్కువే అయినా అంతకు ముందే తన తండ్రి వైఎస్సార్తో కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలకు ఉన్న సంబంధాల కొద్దీ ఇప్పటికీ వారు జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుంటారు. ధిక్కరణ పేరుతో అధినేత్రి సోనియా జగన్ను దూరం పెట్టినా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు జగన్తో కాంటాక్ట్లోనే ఉంటుంటారు. ఈ మధ్యే మృతి చెందిన ఒకప్పటి కాంగ్రెస్ దిగ్గజం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం జగన్ను తండ్రిలా ఆదరించే వారని వైసీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు. జగన్ తమ డీఎన్ఏనే అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒకప్పుడు చెప్పుకున్నారు. బయటికి కనిపించకపోయినా కాంగ్రెస్ నేతలతో జగన్ బంధం దృఢమైనదే. ఎప్పటికైనా కేంద్రంలో మరోసారి యూపీఏ సర్కారు ఏర్పాటు చేయాల్సి వస్తే జగన్ మద్దతు తప్పనిసరి, జగన్ యూపీఏలో చేరడం తప్పనిసరిగా జరిగేవే అని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు.
జగన్-బీజేపీ బంధం..
కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీతో కానీ ఎన్డీయేతో కానీ జగన్ బంధం తాత్కాలికమైనది, అవసరాల మేరకే అన్నది అందరికీ తెలిసిందే. కేంద్రంలో అధికార పార్టీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీకి జగన్ మద్దతు ఇస్తున్నారే తప్ప బీజేపీతో తన భావజాలం కానీ, ఓటు బ్యాంకు కూడా ఎప్పటికీ కలవబోవన్నది జగద్విదితమే. అలాంటి బీజేపీతో జగన్ బంధం రేపు జమిలి ఎన్నికలు జరిగితే అప్పటి వరకూ కానీ లేదా 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగుతుందనే వాదనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. జగన్ తనపై ఉన్న సీబీఐ కేసుల దృష్ట్యా బీజేపీకి అడిగినా, అడగకపోయినా పలు అంశాల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇదీ అందరికీ తెలిసిన వాస్తవమే. అలా చేస్తున్నా ఎన్డీయే సర్కారు నుంచి ఏపీకి ఒనగూరిన ప్రత్యేక ప్రయోజనమేదీ లేదనేదీ కనిపిస్తూనే ఉంది. అయినా తప్పనిసరిగా ఎన్డీయేవైపే ఉండాల్సిన పరిస్ధితి. ఇప్పటికీ జగన్ ఆ నగ్నసత్యాన్ని గమనించే ఎన్డీయేలో చేరకుండానే పరోక్షంగా దోస్తీ కొనసాగిస్తున్నారు..
కాంగ్రెస్ను కెలిసిన విజయసాయిరెడ్డి...
వైసీపీ-బీజేపీ బందం గురించి అందరికీ తెలిసినా మాట్లాడేది మాత్రం తక్కువే. జాతీయ స్ధాయిలో పార్టీలే కాదు రాష్ట్రంలో టీడీపీ కూడా వైసీపీ-బీజేపీ బంధం గురించి ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడదు. తన పాటికి తాను బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటుంది. స్వయంగా వైసీపీ నేతలు సైతం బీజేపీ మత ముద్ర తమ పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కేంద్రానికి అన్ని విధాలా సహకారం అందిస్తున్నా వారితో కలిసి కేంద్రంలో అధికారం పంచుకోకపోవడానికి గల కారణం కూడా ఇదేనని చెబుతారు. కేసుల కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో బీజేపీతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ వైసీపీ తన బంధం కొనసాగించక తప్పదు. అలాగని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్ధితి. కానీ రాజ్యసభలో నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్డీయే తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. దళారుల బెడద తప్పించేందుకు కేంద్రం ఈ బిల్లులు తీసుకొస్తుదని, కాంగ్రెస్ దళారుల పార్టీ అయినందున ఈ బిల్లులను వ్యతిరేకిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Recommended Video
వైసీపీ గుట్టు బయటపెట్టిన కాంగ్రెస్...
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఊపులో బీజేపీతో వైసీపీ బంధాన్ని బయటపెట్టేశారు. బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతిస్తోందో తెలుసు అంటూ ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ.. కేసుల వ్యవహారాన్ని బయటపెట్టారు. మీ ప్రవర్తనేంటి, మీ వ్యక్తిత్వమేంటి, మీకు చరిత్ర ఏంటో చెబుతాం అంటూ ఆనంద్ శర్మ విరుచుకుపడ్డారు. మిమ్మల్ని తిరిగి అక్కడికే (జైలుకే) పంపుతాం, మీరెందుకు బీజేపీకి మద్దతిస్తున్నారో తెలుసు, మీరు, మీ పార్టీ సిగ్గుపడాలి అన్నారు. ఆ తర్వాత మాట్లాడిన మరో ఎంపీ ఆజాద్ కూడా సాయిరెడ్డిని ఉద్దేశించి కోట్లకు కోట్లు దోపిడీ చేశారు, జైలుకు వెళ్లారు, అవినీతి కారణంగా జైలుకెళ్లిన వాళ్లకు బెయిల్ కూ అర్హత లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాస్తవానికి డిప్యూటీ ఛైర్మన్ వారిస్తున్నా వినకుండా దళారుల పార్టీ అంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేసిన సాయిరెడ్డి వ్యాఖ్యలపై ఇతర సభ్యుల నుంచి అసంతృప్తి వ్యక్తమైనా సాయిరెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. చివరికి కాంగ్రెస్ అభ్యంతరాలతో సాయిరెడ్డి వ్యాఖ్యలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ ఛైర్మన్ హామీ ఇచ్చారు.