ఏపీ రాజకీయాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ కోసం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ రాహుల్ కు ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఆ సమయంలో రాహుల్ ఏపీలో రాజకీయాలు..పార్టీ పరిస్థితుల పైన ఆరా తీసారు. కొన్ని కీలక సూచనలు చేసారు. తెలంగాణలో అధికారం పైన ధీమా వ్యక్తం చేసారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్నారు.
ఖమ్మం సభకు వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న రాహుల్ కు పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ థాక్రే, ఏపీ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు..మస్తాన్ వలి..ఇతర నేతలు స్వాగతం పలికారు. ఆ సమయంలో రాహుల్ వారితో ఏపీలోని రాజకీయా పైన ఆరా తీసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ను వీడి వెళ్లిన నేతలు తిరిగి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ఏపీలో పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని..వారికి మద్దతుగా పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ తరహాలో నేతలంతా ఐక్యంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో పార్టీ నేతలు అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలను రాహుల్ అభినందించారు. ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు అందించే ప్రయోజనాల పైన స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. పీపుల్స్ మార్చ్ నిర్వహించిన భట్టి విక్రమార్కను సన్మానించనున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి, గుర్నాధ రెడ్డి వంటి నేతలను వారి మద్దతు దారులతో కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు ఇచ్చే హామీల గ్యారెంటీ కార్డును రాహుల్ విడదుల చేయనున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా ఇక ప్రచారం ప్రారంభించనుంది. పార్టీ నేతలంతా ఈ సభ సక్సెస్ కోసం తరలి వచ్చారు. ఈ సభ పైన పార్టీ భారీ అంచనాలతో ఉంది.
ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ' నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన 'తెలంగాణ జన గర్జన' బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ సభకు పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ స్పందించారు. రాహుల్ గాంధీ సభకు పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications