'ఒక్క మీట నొక్కితే జగన్ వ్యవహారమంతా తేలిపోతుంది'
హైదరాబాద్: ఒక్క బటన్ నొక్కితే చాలు.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా తేలిపోతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆదివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను చెంప చెళ్లుమనిపించాలని ఎలా చెబుతారని మండిపడ్డారు. డిగ్గీని అనేందుకు జగన్కు ఎంత ధైర్యం అన్నారు.
దేశాన్ని దోచుకొని వూరూరా తిరుగుతూ తాను ఒక్కడినే నీతిమంతుడినైనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జైల్లో నుంచి బయటకు వచ్చేందుకే జగన్ ప్రయత్నమని విమర్శించారు. జగన్ కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడనే విషయాన్ని గమనించాలని దిగ్విజయ్కు సూచించారు. వైయస్ కాంగ్రెసు వాడు కాబట్టే జగన్ది కాంగ్రెసు డిఎన్ఏ అని డిగ్గీ అన్నారన్నారు. కడప లోకసభ సీటు ఇవ్వాలని కోరిన చెల్లేలు షర్మిలను జగన్ పక్కన పెట్టారన్నారు.
జగన్ నోటీకి ఎంత వస్తే అంత అన్నట్లుగా మాట్లాడటం సరికాదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. వైయస్ కాంగ్రెసు నేత కాబట్టే తాము ఆయన ఫోటో పెట్టుకున్నామని, టిడిపి వాళ్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను పెట్టుకుంటారని, ఇది సహజమన్నారు. వైయస్ కొడుకుగా పుట్టడం జగన్ అదృష్టమన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా డిగ్గీని అనడం సరికాదన్నారు.
గుంటూరులో రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణలు మండిపడ్డారు. జగన్ రాజకీయాల్లో ఎంతో చిన్నవాడని, అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును చూసుకొని అహంతో ఊగిపోతున్నాడన్నారు. జగన్ది కాంగ్రెసు డిఎన్ఏ కాకుంటే ఎందుకు చెప్పుకోలేకపోతున్నావన్నారు. డిగ్గీ వాస్తవం చెబితే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. డిగ్గీని అన్నందుకు జగన్ బహిరంగ క్షమాపణ కోరితే గౌరవం ఉంటుందన్నారు.