బెంగాల్ టాప్ హాట్ సీట్స్- భవిష్యత్ తేలేది నేడే
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆరంభమైంది. మొత్తం 142 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 92.72 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పోలింగ్ జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ పోరు నెలకొంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న కీలక నియోజకవర్గాలు, అభ్యర్థులు బరిలో ఉన్నారు.
భవానీపూర్: మమతా బెనర్జీ vs సువేందు అధికారి
భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్లో మమతను ఓడించారు. ఆ తర్వాత భవానీపూర్ ఉపఎన్నికలో రికార్డు మెజారిటీతో విజయం సాధించి మమత తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు మరోసారి తలపడుతుండటంతో, ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మక పోరుకు కేంద్రబిందువు అయింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి నందిగ్రామ్లో కూడా బరిలో ఉన్నారు. అక్కడ టీఎంసీకి చెందిన పవిత్ర కర్న్ను ఢీ కొడుతున్నారు.
కోల్కతా పోర్ట్
కోల్కతా పోర్ట్ నియోజకవర్గంలో టీఎంసీ సీనియర్ నాయకుడు ఫిర్హాద్ హకీమ్, బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్తో తలపడుతున్నారు. హకీమ్ 2011 నుంచి ఇక్కడ గెలుస్తూ వస్తోన్నారు. కోల్కతాలో మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. టీఎంసీకి తన పట్టణ పట్టును నిలుపుకోవడానికి కీలకమైనది కూడా.
పానిహాటి
నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ఆసక్తికరమైన వాటిలో ఒకటి. 2024లో కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేవ్నాథ్ను బీజేపీ ఇక్కడ నిలబెట్టింది. పానిహాటి చాలా కాలంగా తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట. ఈసారి టీఎంసీ తీర్థంకర్ ఘోష్ను బరిలోకి దించింది. సీపీఎం అభ్యర్థి కాలాతన్ దాస్గుప్తా కూడా పోటీలో ఉన్నారు.
హింగల్గంజ్
హింగల్గంజ్ రాజకీయంగా సున్నితమైన నియోజకవర్గంగా మారింది. సందేశ్ఖాలీ నిరసనలకు ప్రతీకగా గుర్తింపు పొందిన రేఖా పాత్ర.. ఇక్కడ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో బసిర్హట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఆనంద సర్కార్తో తలపడుతున్నారు. ప్రస్తుతం ఈ స్థానం తృణమూల్ చేతిలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన దేబెస్ మోండల్ సిట్టింగ్ ఎమ్మెల్యే.
కరీంపూర్
నదియా జిల్లాలోని కరీంపూర్ నియోజకవర్గం నుంచి నటుడు, రాజకీయ నాయకుడు సోహమ్ చక్రవర్తి టీఎంసీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ ఈ పోరుకు గ్లామర్ అద్దింది. 2021లో ఈస్ట్ మిడ్నాపూర్లోని చాందిపూర్ నుంచి గెలిచిన ఆయన ఈసారి ఇక్కడికి మారారు. ఇక్కడ బీజేపీ నుంచి సమరేంద్రనాథ్ ఘోష్ పోటీలో ఉన్నారు.
డండం నార్త్
డండం ఉత్తర్ నియోజకవర్గంలో టీఎంసీ సీనియర్ నాయకురాలు, మంత్రి చంద్రమా భట్టాచార్య పోటీ చేస్తున్నారు. ఇది అధికార పార్టీకి అత్యంత కీలకమైన స్థానం. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్నందున, ఈ నియోజకవర్గ ఫలితాలు మెట్రోపాలిటన్ ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయని అంచనా. చంద్రమాతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి తపన్ సిక్దర్ మేనల్లుడు సౌరవ్ సిక్దర్తో పాటు సీపీఎం నాయకురాలు దిప్సిటా ధర్తో తలపడుతున్నారు.
బిధాన్ నగర్..
బిధాన్ నగర్ నుండి టీఎంసీ టికెట్పై సుజిత్ బోస్ పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ నూతన అభ్యర్థి శరద్వత్ ముఖర్జీతో తలపడుతున్నారు. ఇది గ్రేటర్ కోల్కతా ప్రాంతంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన పట్టణ నియోజకవర్గాలలో ఒకటి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సవ్యసాచి దత్తాను ఆయన ఓడించారు.
బరాక్పూర్
నార్త్ 24 పరగణాస్లోని బరాక్పూర్ నియోజకవర్గంలో, దర్శకుడు రాజ్ చక్రవర్తి టీఎంసీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఆయనకు న్యాయవాది, బీజేపీ అభ్యర్థి కౌస్తవ్ బాగ్చి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2021 ఎన్నికల్లో రాజ్ చక్రవర్తి బీజేపీకి చెందిన చంద్రమణి శుక్లాను ఓడించారు.
షోనార్పూర్ సౌత్
షోనార్పూర్ దక్షిణ నియోజకవర్గంలో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు రూపా గంగూలీ, కాంగ్రెస్ అభ్యర్థి లవ్లీ మైత్రాతో తలపడుతున్నారు. హైప్రొఫైల్ సీట్ ఇది. 'మహాభారత్' టీవీ సీరియల్లో ద్రౌపది పాత్రలో నటించారు రూపా గంగూలీ. మైత్రా కూడా బెంగాలీ టీవీ నటి.
వీటితో పాటు.. కోల్కతా, హౌరా, నార్త్ 24 పరగణాస్, సౌత్ 24 పరగణాస్ వంటి కీలక జిల్లాల్లో ఈ దశలో పోలింగ్ జరగనుంది. ఇది అధికార పోరులో నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలు సాంప్రదాయకంగా టీఎంసీకి కంచుకోటలు. బీజేపీ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చగలదా అనేది ఈ దశలో పరీక్షకు నిలవనుంది.












Click it and Unblock the Notifications