ys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనం
ఉత్తరాదికి భిన్నంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఇప్పటికీ కొనసాగుతుండటం, మహానేతల పేర్లతో వాళ్ల వారసులు జనంలోకి వస్తుండటం పరిపాటిగా మారిన దరిమిలా.. తెలంగాణ వేదికగా వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సుదీర్ఘ ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో షర్మిలది తొలి వారసత్వ పార్టీ కానుంది. కాగా, దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లాగే, తెలంగాణలోనూ, ప్రత్యేకించి హైదరాబాద్ వేదికగా రాబోయే రోజుల్లో మరిన్ని వారసత్వ పార్టీలు పుట్టుకొస్తాయని, షర్మిల ఇచ్చిన ఊపుతో రేప్పొద్దున జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టేస్తారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు..
జగన్ పార్టీకి షర్మిల దెబ్బ! -తొలి వికెట్? -బ్రదర్ అనిల్తో ఆ దంపతులు భేటీ -లోటస్పాండ్కు విజయమ్మ
జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన 'వైఎస్ షర్మిల కొత్త పార్టీ' వ్యవహారంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తనదైన విశ్లేషణ చేశారు. మిగతా నాయకులకు భిన్నంగా, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, హైదరాబాద్ ఒక పొలిటికల్ ప్రయోగశాలగా మారడం, షర్మిల పార్టీపై కేసీఆర్ మౌనం వహించడం, చంద్రబాబు తదుపరి ఎత్తుగడ, వైఎస్సార్ ఆశయాలు, ఆయన రాజకీయ వారసత్వం తదితర అంశాలపై జగ్గారెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
జగన్ మాట వినలేదంటే నమ్మాలా?
''కాంగ్రెస్ పార్టీని అన్ని కోణాల్లోనూ దెబ్బతీయాలనే విస్తృతమైన అజెండాలో భాగంగా.. తెలంగాణపైకి బీజేపీ వదిలిన బాణమే షర్మిల రెడ్డి. ఏపీలో జగన్ ఎలాగూ బీజేపీ అండర్ లోనే ఉన్నాడు. చంద్రబాబు మాత్రం గోడ మీద పిల్లిలా అటూ ఇటూ కాకుండా ఉన్నాడు. ఇటు తెలంగాణలో కేసీఆర్ గానీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీగానీ బీజేపీ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు షర్మిల కూడా ముమ్మాటికే అదే డైరెక్షన్ లోనే ఇక్కడికొచ్చింది. కొత్త పార్టీ విషయంలో జగన్ మాట షర్మిల వినలేదని వైసీపీ నేతలు చెప్పడం నమ్మశక్యంగా లేవు. మహానేత వైఎస్సార్ ఆశయసాధకులం అని చెప్పుకుంటోన్న ఆ ఇద్దరికీ పడకపోతే, ఇక జనానికి ఏం చెబుతారు? కాబట్టి, షర్మిల పొలిటికల్ ఎంట్రీ వెనుక, ఆమె తెలంగాణనే ఎంచుకోడానికి వెనకున్న నిగూఢ కారణాలను మనం విశ్లేషించాలి. ప్రధానంగా..
సెటిటర్లపైనే షర్మిల గురి..
గడిచిన కొద్దికాలంగా ఉత్తరభారతంలో బీజేపీకి ఆదరణ తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వాళ్లకు ఇదవరకటిలా ఎంపీ సీట్లు రావు. దీంతో వాళ్ల ఫోకస్ దక్షిణాదివైపు పెంచారు. హైదరాబాద్ కేంద్రంగా ఉండే తెలంగాణలో తొలి నుంచీ కమ్యూనల్ ప్రభావం ఎక్కువ. అదే సమయంలో సెటిలర్స్ సంఖ్య కూడా ఎక్కువే. 4.5కోట్ల తెలంగాణ జనాభాలో కనీసం 1కోటి మంది సెటిలర్సే ఉన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సెటిలర్లతోపాటు అందరూ కాంగ్రెస్ వెంటనే నడిచారు. 42 ఎంపీలున్న ఉమ్మడి రాష్ట్రం.. కాంగ్రెస్ కు కంచుకోటగా, అత్యధిక ఎంపీలు అందించిన రాష్ట్రంగా ఉండేది. విడిపోయిన తర్వాత తెలంగాణలో 17, ఏపీలో 25 ఎంపీ సీట్లున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఎలాగూ బీజేపీ కంట్రోల్ లోనే ఉన్నాడు. చంద్రబాబుతో ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బలంగా ఉంది. కేసీఆర్, ఎంఐఎంలకు ప్రమాదం లేకుండా, కాంగ్రెస్ ను దెబ్బతీసేలా, తెలంగాణలోని సెటిలర్లను తిప్పేసుకునేలా బీజేపీ ప్రయోగించిన బాణమే షర్మిల. బీజేపీ అనే మర్రిచెట్టుకు మరో కొమ్మ షర్మిల. తెలంగాణలో పాగా కోసం రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకుంటున్నారు. నిజానికి..
వైఎస్కు నిజమైన వారసులు ఎవరు?
వైఎస్ షర్మిల.. రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకున్న కూతురే కావొచ్చు. కానీ వైఎస్ నేతగా ఎదిగింది, ముఖ్యమంత్రి అయింది ఆయన రక్తం పంచుకున్న కూతురి వల్ల కాదు.. రక్తం పంచుకోకుండానే ఆయనను అభిమానించిన కార్యకర్తలు, ప్రజల వల్ల తానా స్థాయికి చేరాడు. వైఎస్సార్ సీఎం అయ్యాక షర్మిల వారసురాలు అయిందికాగా, వైఎస్సార్ తొలి నుంచీ కాంగ్రెస్ వారసుడే అన్నది నిజం. తర్వాతి కాలంలో వైఎస్ పేరు మీద మాలాంటివాళ్లం కాంగ్రెస్ లో చేరి, ఆయనకు వారసులు అయ్యాం. ఇప్పుడు షర్మిల సడెన్ గా దిగొచ్చి వైఎస్ వారసురాలిని అని చెప్పుకోవడం కరెక్టుకాదు. ఏనాడూ రాజకీయాల్లో లేని, ప్రజల వెంట నడవని, కేవలం గృహిణిగా ఉండిన షర్మిల.. సడెన్ గా తెరపైకొచ్చి నేనే వైఎస్ వారసురాలిని అని చెప్పుకోవడమంటే అది కాంగ్రెస్ ను దెబ్బతీయడమే. సెటిలర్లలో చీలిక తేవాలన్నదే ఆమె ప్రయత్నం. అదీగాక..
పెద్దాయన ఆత్మ శాంతించదు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు ఉన్నప్పటికీ, అంతో ఇంతో బలంగా ఉన్న రెడ్డి నాయకత్వాన్ని పార్టీ నుంచి వేరు చేయడానికే షర్మిల వస్తోందనే అనుమానాలున్నాయి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు లేకుంటే తాను లేనని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా జీవితాశయం అని వైఎస్ కొన్ని వందల సార్లు చెప్పారు. మరి వైఎస్ వారసురాలిని అని చెప్పుకుంటోన్న షర్మిలకు ఇది పట్టదా? వైఎస్ కూతురిగా ఆయన కోరిక తీర్చాల్సిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరొద్దు? షర్మిల సొంత పార్టీ కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరితే, తండ్రి ఆశయాన్ని సాధించినంది కూడా అవుతుంది. అది జరగకుంటే వైఎస్ ఆత్మ శాంతించదు. తండ్రి ఆశయానికి విరుద్ధంగా వెళుతూ షర్మిల తప్పు చేస్తోంది. ఈ ఊపులో..
జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ..
షర్మిల వ్యూహాత్మకంగానే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేశారు. హైదరాబాద్ తోపాటు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని మెజార్టీ ప్రాంతాలు ఆంధ్రాతో సంబంధాలు కలిగున్నాయని తెలిసిందే. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేడి కూడా కలిసొస్తుందని షర్మిల ఇప్పుడే రంగంలోకి దిగింది. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఎప్పుడైనా, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు. షర్మిల ఇచ్చిన ఊపుతో రేప్పొద్దున చంద్రబాబు కూడా కొత్త పార్టీ పెట్టిస్తాడు.. ఎన్టీఆర్ వారసత్వం పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ను నాయకుడిగా పార్టీ పెట్టిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తోంది.. ఈ మాత్రం దానికే మనం విడిపోయి ఉండాలా? ప్రత్యేక తెలంగాణ వల్ల మనకు ఒరిగిందేంటి? మళ్లీ అదే ఆంధ్రా కాంట్రక్టర్ల పెత్తనం, మళ్లీ అదే ఆంధ్రా నేతల పొలిటికల్ ఎంట్రీలు. ఈ గొల నడుమ తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, పేదలు, బడుగువర్గాల గురించి ఏ ఒక్కరూ మాట్లాడటంలేదు, పట్టించుకోనూ లేదు. అంతెందుకు..
మళ్లీ సమైక్య రాష్ట్రం.. శవాలపై రాజకీయం..
హైదరాబాద్ నుంచి చంద్రబాబును వెళ్లగొట్టడానికి కేసీఆర్ ఎన్ని డ్రామాలు ఆడిండో మనమంతా చూశాం. మరి ఇవాళ అదే ఆంధ్రాకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానంటోంటే కేసీఆర్ ఎందుకో మాట్లాడట్లేదేం? షర్మిల గురించి టీఆర్ఎస్ ఒక్కమాటైనా అనట్లేదేం? హైదరాబాద్ అంటే ఆంధ్రోళ్లకు పొలిటికల్ టూరిజం స్పాటా? ఎవడంటే వాడొచ్చి, ఆడుకొని పోవచ్చు అన్నట్లు తయారైంది. ఇంత దుర్మార్గమైన రాజకీయాలా? బీజేపీ స్క్రిప్టు ప్రకారం నడుచుకుంటోన్న టీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం, కొత్తగా షర్మిల పార్టీ.. వీళ్లంతా దొంగలే. తెలంగాణ ప్రజలను చంపి.. పీనుగల మీద రాజకీయం చేయడానికి వస్తున్నారు. వైఎస్సార్ మీద ప్రజల్లో ఉన్న అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి షర్మిల ప్రయత్నిస్తోంది. తద్వారా తెలంగాణ ప్రజలం చాలా డేంజర్ జోన్ లో పడిపోతున్నామని గుర్తించాలి'' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్పై సంచలనం -19నుంచే సీఎంకు తెలుసన్న ప్రధాన్