యుద్ధనౌక కు విశాఖ పేరుతో కొత్త వివాదం - రాజ్నాథ్కు రఘురామ ఫిర్యాదు : కోర్టు ధిక్కారమంటూ..!!
మూడు రాజధానుల వివాదం ఏపీలో కొనసాగుతున్న సమయంలోనే..విశాఖ పేరుతో మరో కొత్త సమస్య మొదలైంది. డిసెంబర్ 4న విశాఖలో నేవీ డే ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలంటూ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్సింగ్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. అదే సమయంలో త్వరలో ముంబయిలో నౌకాదళంలో ప్రవేశపెట్టనున్న 15బి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక గురించి వివరించారు. దానికి ఏపీ పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టినట్టు చెప్పారు. 2022లో జరిగే ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి ఆయన వివరించారు.

పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ
ఆ సమయంలోనే భారత నౌకాదళంలో త్వరలో ప్రవేశపెట్టనున్న యుద్ధనౌకకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిఫెన్స్ విభాగం జారీ చేసిన ప్రకటనలో ప్రస్తావించడం వివాదాస్పదమైంది. మూడు రాజధానుల అంశం ఇంకా కోర్టు విచారణలో ఉండగానే... విశాఖను పరిపాలనా రాజధానిగా పేర్కొంటూ పీఐబీ డిఫెన్స్ విభాగం ప్రకటనం చేయడం, అది కూడా తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్సింగ్ ముఖ్యమంత్రి జగన్కు స్వయంగా ఆ విషయం చెప్పారనడం తాజా అభ్యంతరాలకు కారణమవుతోంది.

మూడు రాజధానుల వివాదం కొనసాగుతుండగా
పీఐబీ డిఫెన్స్ విభాగం పేరుతో విశాఖపట్నం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం విడుదలచేసిన ప్రకటనలోనూ అదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో..దీని పైన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న వారు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. తాజాగా.. ఇదే అంశం పైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ఫిర్యాదు చేసారు. ముంబయిలో నిర్మిస్తున్న యుద్ధ నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరునే కొనసాగించాలని ఆయన తన లేఖలో కోరారు.

రాజ్నాథ్సింగ్కు రఘురామ లేఖ
ఆ నౌక పేరును ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చడం కోర్టు ధిక్కారమే అవుతుంది. మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేకంగా కార్యనిర్వాహక రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమే...అంటూ కేంద్ మంత్రికి రాసిన లేఖలో వివరించారు. ఈ అంశంలో సివిల్ మిలటరీ లైజన్ అధికారిగా ఉన్న కమాండర్ సుజిత్రెడ్డిపై విచారణ చేపట్టాలని, ఉద్దేశపూర్వకంగా నౌకాదళం ప్రతిష్ఠను దెబ్బతీసే వారి నుంచి యూనిట్ను రక్షించాలని, సదరు అధికారి తన విధులకు కట్టుబడి ఉండేలా చూడాలని ఎంపీ రఘురామ కోరారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం పైన కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందో...ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications