ఆ డబ్బు మీరెలా పంచుతారు? బాధ్యతగా వ్యవహరించాలి: జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని, దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నామవుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఏపీలో కరోనా కేసులు అత్యధికంగా.. అందువల్లే ఆలస్యం..
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై సంఘీభావం తెలిపారని అన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. మనం పరిశుభ్రంగా ఉంచుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 62 శాతం కరోనా కేసులు పెరిగాయని చంద్రబాబు తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే మనదేశంలో 222 శాతం కరోనా కేసులు పెరిగాయన్నారు. ఏపీలో అత్యధికంగా ఒక్కవారంలోనే 1000 శాతానికి పైగా కరోనా కేసులు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. ఇతర రాష్ట్రాల పోలిస్తే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయన్నారు. పరీక్షలు తక్కువ చేస్తే కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని.. పరీక్షలు ఎక్కువ చేస్తే కేసులు వెంటనే బయటపడతాయని చెప్పారు.

జగన్ సర్కారు మరింత బాధ్యతగా ఉండాలి..
కరోనా పాజిటివ్ వచ్చిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం సరికాదని, అయితే, వారందరినీ ఇతరులతో కలవనీయకుండా చూడాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఏపీ ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని.. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను పాటించాలని చంద్రబాబు కోరారు. మత, రాజకీయపరమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనావైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. అలాగే నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించవద్దని చంద్రబాబు అన్నారు. తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నియంత్రించవచ్చన్నారు. కరోనాపై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మకూడదని చెప్పారు.

వారిని ఆదుకోవాలి..
అనారోగ్యంగా ఉన్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వీలైనంత వరకు యోగా, ధ్యానం చేయాలని.. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు అన్నారు. అవసరమైన మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, అత్యవసర సిబ్బందికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులు, క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి రక్షణ పరికరాలు వెంటనే అందజేయాలని అన్నారు. రైతులు, ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం సాయం వారెలా అందజేస్తారు?
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయని, ఢిల్లీ ప్రభుత్వం రూ. 5వేలు ఇస్తోందన్నారు. ఏపీ కూడా పేదలకు తొలి విడతగా కనీసం రూ. 5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో రూ. 1000 చొప్పున ఇస్తున్న నగదును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంచడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. రేషన్, పింఛన్లలో అనేకమందికి కోత విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అన్ని పార్టీల నేతల సలహాలు, సూచనలు తీసుకోవాలని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications