హైదరాబాద్ టు చెన్నైకు రెండు గంటల్లోనే, ఈ రెండు రూట్లలోనూ - అశ్వినీ వైష్ణవ్ ప్రకటన..!!
హైదరాబాద్ కేంద్రంగా రైల్వే కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ బుల్లెట్ రైలు హబ్ గా మారనుంది. కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రధాన మార్గాలకు ఖరారు చేసారు. రైల్వే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ తెలంగాణకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అందులో భాగంగా కీలక అంశాలను వెల్లడించారు.
హైదరాబాద్ కేంద్రంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేసారు. రైల్వేలో వస్తున్న అనూహ్య మార్పుల గురించి వివరించారు. గత బడ్జెట్ లో ప్రకటించిన విధంగా దేశ వ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో మూడు హైదరాబాద్ కేంద్రంగా ఖరారు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో రైల్వే విప్లవం నడుస్తుందని కొత్తగా సాంకేతికతను వినియోగిస్తూ.. పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలతో రైళ్లను అందుబాటు లోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.

బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 1 గంట 10 నిమిషాల సమయంలో చేరుకోవచ్చని వివరించారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో, ఇక.. హైదరాబాద్ నుంచి చెన్నయ్కి రెండు గంటల్లో వెళ్లవచ్చని మంత్రి వివరించారు.
బుల్లెట్ రైలు వ్యవస్థ దేశంలో గేమ్ ఛేంజర్ గా మారనుందని వెల్లడించారు. ఈ క్రెడిట్ తీసుకునేలా కొందరు ప్రయత్నాలు చేసారని విమర్శించారు. భారతీయ రైల్వేలో సమూల మార్పులు.. సంస్కర ణల క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే భారీ మార్పులు వస్తాయని వివరించారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో రూ 800 కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇస్తే.. మేము తెలంగాణకు 5000 కోట్ల రూపాయలు ఇచ్చామని లెక్కలు వెల్లడించారు.
తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన బీజేపీ అధినాయకత్వం.. పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపుతోంది. పలు వర్గాల వారితో ఆ మంత్రులు సమావేశాలు నిర్వహిస్తూ.. బీజేపీ పాలనలో వచ్చిన మార్పులను వివరిస్తున్నారు. అందులో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హైదరాబాద్ లో పలు సమావేశాలు నిర్వహించారు.














Click it and Unblock the Notifications