పొలిటీషియన్ల టాలెంట్కు సలాం: కరోనాను కూడా వదల్లేదు.. భలేగా వాడేసుకున్నారు: రాజకీయాల కోసం .. !
అమరావతి: భూగోళం మొత్తాన్నీ గజగజమంటూ వణికిస్తోన్న డెడ్లీ కరోనా వైరస్ను కూడా తమ రాజకీయాల కోసం వాడేసుకుంటున్నారు మన పొలిటీషియన్లు. కరోనా వైరస్ పేరెత్తితే హడలిపోతున్నాయి ప్రపంచ దేశాలు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నాయి. అలాంటి డెడ్లీ వైరస్.. జగమొండి మహమ్మారిని కూడా తమ రాజకీయాల కోసం వినియోగించుకోవడం అంటే మాటలా?. కానే కాదు. పాలిటిక్స్ అంటే అంతే మరి. పొలిటీషియన్ల తెలివి తేటలు ఇలాగే ఉంటాయని మరోసారి నిరూపించారు మన రాజకీయ నాయకులు.
ఏపీలో స్థానిక సంస్థలు వాయిదా..
మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకుంటున్న వేళ.. అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆరంభం కావడానికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్రంలో కరోనా వైరస్ తిష్ట వేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం వల్ల అది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందనే ఏకైక కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారాయన.
రాజకీయ ప్రేరేపితంగా..
తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశపూరకంగా వాయిదా వేయించారని ఆరోపణలు, విమర్శలను గుప్పిస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనా వైరస్ పేరు చెప్పుకొని ఎన్నికలను వాయిదా వేశారని చెబుతోంది. కరోనా వైరస్ వ్యాపించిన ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారని, ఆ డెడ్లీ వైరస్ పేరుతో రమేష్ కుమార్ను ప్రభావితం చేశారని చెబుతున్నారు.
మధ్యప్రదేశ్లో అదే తీరు..
మధ్యప్రదేశ్లో కూడా ఏపీ తరహా పరిస్థితులే ఏర్పడ్డాయి. కరోనా వైరస్ పేరు చెప్పుకొని.. బలపరీక్ష గండం నుంచి తప్పించుకుంది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తాత్కాలికమే అయినప్పటికీ.. పరిస్థితులను తారుమారు చేయడానికి 10 రోజుల పాటు వీలు కలిగినట్టయింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్నాథ్కు. కరోనా వైరస్ వ్యాపించిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యే బలపరీక్షను నిర్వహించడం సబబు కాదని, అలాంటి అనిశ్చిత పరిస్థితులను సృష్టించడం సరికాదనే ఉద్దేశంతోనే మధ్యప్రదేశ్ స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు వాయిదా వేశారు.
Recommended Video
అటు తెలుగుదేశం.. ఇటు కాంగ్రెస్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరవైన పరిస్థితుల నుంచి ఒడ్డున పడటానికి చంద్రబాబు కరోనా వైరస్ను అడ్డుగా పెట్టుకున్నారంటూ ఏపీలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. బలపరీక్ష గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ నేత కమల్నాథ్ కరోనా వైరస్ పేరును అడ్డంగా వాడేసుకుంటున్నారని చెబుతున్నారు. అటు ఏపీ, ఇటు ఎంపీల్లో నెలకొన్న ఈ పరిస్థితులకు కారణం.. కరోనా వైరస్ కావడం..మన పొలిటీషియన్ల తెలివి తేటలకు అద్దం పడుతోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇదే వాయిదాలపై మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, మధ్యప్రదేశ్లో బీజేపీ న్యాయస్థానాలను ఆశ్రయించడం మరో ట్విస్ట్.