మంత్రి కన్నబాబు-అంబటిపై నాన్బెయిలబుల్ వారెంట్ : హెరిటేజ్ కేసు -అమలుకు కోర్టు ఆదేశం..!!
ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు..ఎమ్మెల్యే అంబటి రాంబాబు పైన తాము జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.మేరకు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదే పదే న్యాయస్థానానికి గైర్హాజరు కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి చెందిన హెరిటేజ్ సంస్థ పైన చేసిన ఆరోపణల పైన న్యాయస్థానంలో కేసు దాఖలైంది.
కన్నబాబు..అంబటి పదే పదే తమ రాజకీయ ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్ఠను భంగం వాటిల్లే విధంగా వ్యవహరించారంటూ హెరిటేజ్ సంస్థ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసింది. వారిద్దరి వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లుతోందని అందులో పేర్కొంది. వారు ఆరోపంచినట్లుగా తాము ఎక్కడా బ్యాంకు కు రుణం ఎగవేత జరగలేదని వివరిస్తూ..సంస్థ ఆర్దిక ఎదుగుదలను వివరించింది. వారు చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎం సాంబశివరావు తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
హెరిటేజ్ సంస్థ 1993-94 లో స్థాపించిన సమయంలో తొలుత ఆదాయం నాలుగు కోట్ల రూపాయలుగా ఉందని..క్రమేణా ఎదుగుతూ 2019-20 నాటికి రూ 2,726 కోట్లకు చేరిందంటూ అందులో పేర్కొన్నారు. తాము ఏ బ్యాంకుకు రుణం ఎగవేయలేదని చెప్పపుకొచ్చారు. హెరిటేజ్ సంస్థకు దాదాపుగా 20 వేల డిస్ట్రిబ్యూటర్లు..ఏజెంట్లు పని చేస్తున్నారని వివరించారు. మూడు లక్షల మంది తమ హెరిటేజ్ సంస్థకు పాలు విక్రయిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి హెరిటేజ్ సంస్థ పైన నిరాధార ఆరోపణలు చేయటం సరి కాదంటూ..అభ్యంతరం వ్యక్తం చేసారు.
Recommended Video
ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన కేసులో..వీరిద్దరూ కన్నబాబు - అంబటి రాంబాబు పదే పదే కోర్టుకు గైర్హాజరవుతున్నారు. దీంతో..వీరిద్దరి పైన గతంలో కేసు విచారణ సమయంలోనే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనికి సైతం వారిద్దరూ స్పందించలేదు. దీంతో...తాజాగా కోర్టు వారద్దరినీ వెంటనే అమలు చేయాలని ..పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సమయంలో హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి సైతం కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.