కల్తీ మద్యం కేసు: మల్లాది విష్ణుకు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ
విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నిందితుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు 4 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు మల్లాది విష్ణుని పోలీసులు విచారించనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మల్లాది విష్ణును విచారించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎల్ నివేదికను సిట్ అధికారులు సీల్ట్ కవర్లో పెట్టి కోర్టుకు సమర్పించారు. బెజవాడ కృష్ణలంకలో కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణబార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు కూలీలు మృతి చెందగా, 25 మంది వరకు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన సిట్ స్వర్ణబార్లో మద్యంలో కల్తీ జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో బార్లో పనిచేస్తున్న మేనేజర్తో సహా మొత్తం 9మందిని అరెస్ట్ చేసింది.
ఇటీవలే సిట్ ముందు విచారణకు హాజరైన మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ను అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను మంగళవారం విచారించిన విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 9 మంది బార్ సిబ్బందికి బెయిల్ మంజూరు చేసింది.
మల్లాది విష్ణు సోదరులకు మాత్రం బెయిల్ మంజూరు చేయలేదు. సుమారు రెండు రోజుల పాటు సిట్ బృందం విచారించిన తర్వాత కల్తీ మద్యం కేసులో బార్ను అక్రమంగా నడుపుతున్నారని, సిట్ ముందు పొంతన లేని సమాధానాలు చెప్పినందుకు విష్ణుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.