పోలీసులకు షాక్: రిషికేశ్వరి కేసులో ఛార్జీషీట్ తిరస్కరించిన కోర్టు
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో పోలీసులకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీటును న్యాయస్థానం గురువారం నాడు తిరస్కరించింది. ఛార్జీషీటు సక్రమంగా లేదని జడ్జి పేర్కొన్నారు.
ర్యాగింగ్ సంబంధించిన చట్టాలే కాకుండా మరో కీలకమైన ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్(పోక్సో) చట్టాన్ని కూడా తొలిసారిగా ఛార్జిషీటులో పొందుపరిచారు. ఐతే రిషికేశ్వరి మైనర్ కాదని అందువల్ల ఆ చట్టం వర్తించదని జడ్జి అభిప్రాయపడ్డారు.
ఈ చట్టం పరిధిలోకి రానప్పుడు ఇక్కడి కోర్టులో న్యాయస్థానంలో విచారణ సాధ్యపడదని, వేరే కోర్టుకు వెళ్లాలంటూ చార్జిషీటును తిరస్కరించింది. కాగా, స్థానిక కోర్టు తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రిషికేశ్వరి తరపు లాయర్ చెప్పారు.
కాగా, రిషికేశ్వరి కేసులో మరికొంతమందిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు గత శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చార్జిషీట్లో ప్రిన్సిపాల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హనీషా, జయ తరణ్, సాయి శ్రీనివాస్ అనే నిందితులను అరెస్టు చేయగా, 47 రోజుల తరువాత వారు బెయిల్పై వారు విడుదలయ్యారు.