వచ్చే వారం నుంచి ఏపీలో స్కూళ్లు-తల్లితండ్రుల్లో ఆందోళన-సర్కార్ వ్యాక్సినేషన్ భరోసా
ఏపీలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. సెకండ్ వేవ్ ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంకా ప్రతీ జిల్లాలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో ఆగస్టులో కరోనా ధర్డ్ వేవ్ తప్పదన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అయితే వైసీపీ సర్కార్ మాత్రం స్కూళ్లు తెరిచేందుకే మొగ్గుచూపుతోంది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న భయాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చే వారం నుంచి స్కూళ్లు తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
Recommended Video

ఆగస్టు 16 నుంచి ఏపీలో స్కూళ్లు
ఏపీలో కరోనా ప్రభావం గతంలో పోలిస్తకే కాస్త తగ్గడంతో పాఠశాలలు, విద్యాసంస్ధల్ని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం.. స్కూళ్లు తెరిచే నాటికి అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. దీంతో స్కూళ్లకు వచ్చే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెబుతోంది.

ధర్డ్ వేవ్ భయాలు
ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభం కావడానికి మరో ఐదు రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వం స్కూళ్లను తెరిచేందుకు సిద్ధమవుతోంది. దీంతో విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో కరోనా ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్నాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్కూళ్లను తెరిస్తే ఆ తర్వాత తమ పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని తల్లితండ్రులు భయపడుతున్నారు. దీంతో ఆగస్టు 16 న స్కూళ్లు తెరిచినా పిల్లల్ని తల్లితండ్రులు పంపించడం అనుమానంగానే కనిపిస్తోంది.

పూర్తి కాని వ్యాక్సినేషన్
వచ్చే వారం నుంచి ఏపీలో స్కూళ్లు తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం... కొన్నిరోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే టీచర్లకు వ్యాక్సిన్లు వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. వ్యాక్సిన్ల కొరతతో పాటు ఇతరత్రా సమస్యల కారణంగా వ్యాక్సినేషన్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. తాజాగా ప్రభుత్వం వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినా ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్ధుల తల్లితండ్రుల్లో భయాలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తి కాని టీచర్ల వద్దకు పిల్లల్ని పంపితే వైరస్ సోకుతుందనే భయాలు నెలకొంటున్నాయి.

సర్కార్ తలోమాట
వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే వచ్చే వారం నుంచి ఏపీలో స్కూళ్లు తెరిచేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. తాము అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల విషయంలో మాత్రం జంకుతోంది. ప్రస్తుతం ఇంకా వైరస్ ప్రభావం తగ్గనందున వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం అక్టోబర్ లేదా నవంబర్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాంటిది ప్రభుత్వ పాఠశాలల్ని మాత్రం ఠంచనుగా ఆగస్టు 16నే ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఓ లెక్క, తమ పిల్లల చదువుల విషయంలో మరో లెక్కా అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు.

తేడా వస్తే అంతే సంగతులు
ఆగస్టు 16న పాఠశాలల్ని పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్ధులు వరుసగా రెండు విద్యాసంవత్సరాలు కోల్పోయిన నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్ధితి ఎదురు కాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా వాస్తవ పరిస్ధితుల్ని ఆధారంగా చేసుకుని తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని మెజారిటీ విద్యార్ధుల తల్లితండ్రులు భావిస్తున్నారు. ఓసారి స్కూళ్లు తెరిచాక పరిస్ధితులు విషమిస్తే అప్పుడు తిరిగి మూసేస్తారా అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యార్ధులు ఆన్ లైన్ చదువులకు అలవాటు పడిన తరుణంలో మరికొంతకాలం ఈ విధానాన్నే కొనసాగిస్తే మంచిదనే భావన వారిలో వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని చెబుతోంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇస్తోంది.












Click it and Unblock the Notifications