ఏపీ రాజధానిపై రాఘవులు కొత్త డిమాండ్.. అమెరికాలో కూడా అది కుదరదన్న సీపీఎం నేత
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచి భిన్నవ్యాఖ్యలు చేస్తోన్న కమ్యూనిస్టు పార్టీలు మరోసారి కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్, కర్నూలును జ్యూడీషియరీ క్యాపిటల్ గా మార్చాలనుకుంటోన్న జగన్ సర్కారు ఆలోచన కరెక్ట్ కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మూడు రాజధానుల్ని సీపీఎం వ్యతిరేకిస్తున్నదని, అన్ని వ్యవస్థల్ని ఒకే చోట ఉంచాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. డెవలప్మెంట్ కోసమే మూడు రాజధానుల ఏర్పాటు అన్న వాదన ఏమాత్రం సహేతుకంగా లేదన్నారు.
అలా ఉంటేనే సౌకర్యం..
పాలన వికేద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే దిష్టికోణంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ సర్కారు సంకేతాలిచ్చింది. ఈమేరకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ రిపోర్టుల అధ్యయనానికి ప్రభుత్వం హైపరవ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ వ్యవహారాలపై సీపీఎం నేత రాఘవులు స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిపాలన మొత్తం ఒకే చోట కేంద్రీకృతమై ఉంటేనే అందరికీ సౌకర్యంగా ఉంటున్నారు.
అమెరికాలోనైతే లోనికి కూడా రానివ్వరు..
‘‘పార్లమెంటరీ డెమోక్రసీలో మంత్రివర్గం ఎక్కడుంటే సెక్రటేరియట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎక్కడుంటే శాసనసభ కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ వ్యవస్థల మధ్య చాలా దగ్గరి సంబధం ఉంటుంది. ప్రతిరోజూ మంత్రులు పర్యవేక్షణ చేయాల్సిఉంటుంది. అమెరికాలో ప్రెసిడెంట్ వెళ్లి సెనేట్ లో కూర్చుంటానంటే రానివ్వరు. అక్కడ పరిపాలనతో మంత్రులు, సభకు అసలేమాత్రం సంబంధం కూడా ఉండదు. అలాంటి పోలికలు తేవడం కంటే.. ఇక్కడేది ఉపయోగమో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది''అని సీపీఎం నేత చెప్పారు.
అభివృద్ధి కోసమే అనడం అబద్ధం..
ఉత్తరాంధ్రను అభి చేయడానికే రాజధానుల్లో ఒక భాగాన్ని విశాఖపట్నంలో పెడుతున్నామని ముఖ్యమంత్రి జగన్, వాళ్ల పార్టీ నేతలు పదే పదే చెబుతుండటంపైనా రాఘవులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనుకుంటే.. ఉత్సవాలు నిర్వహిస్తే సరిపోదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించడం, రైల్వేలో లాభాలున్న ప్రాంతాలనూ కలుపి పూర్తి స్థాయి రైల్వేజోన్ ఏర్పాటు చేయడం, పోస్కో లాంటి కంపెనీలతో విశాఖపట్నం బయట ఫ్యాక్టరీలు పెట్టించడం, గిరిజన యూనివర్సిటీని నెలకొల్పడం లాంటి పనులు చేయొచ్చని రాఘవులు సూచించారు.