వార్డు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ - సీఎస్ కమిటీ సిఫార్సు : రూ 15,030 నుంచి రూ. 46,060 దాకా వేతనాలు..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మరో కీలక నిర్ణయం రాబోతోంది. తాజాగా, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ సిఫార్సుల అమలు పైన సీఎస్ నాయకత్వంలోని అధికారుల కమిటీ పలు సిఫార్సులు చేసింది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ అమలు చేయాలని కమిటీ తమ సిఫార్సుల్లో పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ ప్రకటించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.

పీఆర్సీ పై సీఎస్ కమిటీ సిఫార్సులు
వాస్తవానికి కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని.. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ పీఆర్సీ సచివాలయాల ఉద్యోగులకు వర్తించే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. కానీ, ఇదే సమయంలో వారికి కూడా తాము ఎందుకు పీఆర్సీ సిఫార్సు చేస్తున్నామనే అంశం పైన క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ సమయంలో వారిని వదిలి వేయడం సబబు కాదన్న ఉద్దేశంతో తుదకు ఆయా ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ సిఫార్సులను వర్తింపజేయాలన్న ప్రతిపాదన చేస్తున్నట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ప్రొబేషనరీ ప్రకటన తరువాత
ప్రొబేషనరీ ప్రకటన అనంతరం సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 1,800 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో చెప్పుకొచ్చింది. సచివాలయ వ్యవస్థలో 19 రకాల క్యాడర్ ఉద్యోగులకు రెండు రకాల పే స్కేల్ నిర్ణయం... గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా కమిటీ సూచించింది.

రెండు రకాల పే స్కేళ్ల అమలు దిశగా
అదే విధంగా.. గ్రామ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రేడ్-2 అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్ర్ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేసింది.

1.34 లక్షల మందికి ప్రయోజనం
గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వెల్ఫ్ర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. సీఎం జగన్ 15,004 సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రొబేషనరీ ప్రకటన పూర్తయిన తరువాత మాత్రమే వారికి ఈ సిఫార్సులు అమల్లోకి వస్తాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications