తీరం దాటిన తుఫాను - భారీ వర్షాలు : ఆ జిల్లాలు వణుకుతున్నాయి..!!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండౌస్ తీరం దాటింది. అర్ద్రరాత్రి మహాబలిపురం వద్ద తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అంచనా వేసినట్లుగానే పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వెల్లడించింది. ఈ ఉదయం మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగండంగా మారనుంది. మధ్నాహ్నం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడుతో పాటుగా ఏపీలోని పలు జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాలు చలిగాలులతో వణుకుతున్నాయి.
అర్ద్రరాత్రి తీరం దాటిన తుఫాను
తుఫాను దీరం దాటింది. తీరం వెంబటి 65 -75 కిలో మీటర్ల వేగంగతో గాలులు వీచాయి. కోస్తా - రాజలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం లో 125.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా నాయుడిపేటలో 114 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఈ రోజు దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాలతో పాటుగా ఉత్తర కోస్తా, అదేసమయంలో రాయలసీమ లోని పలు చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అప్రమత్తం చేసారు. మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతో పాటుగా పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు..అదే విధ:గా 26 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి.
చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీగా ఈదురు గాలులతో చెట్లు విరిగి పడ్డాయి. చెన్నై నుంచి నడవాల్సిన 27 విమానాలను రద్దు చేసారు. చెన్నైతో పాటుగా 5 ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
నేడు - రేపు వర్షప్రభావం
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శనివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అతిభారీగా, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
11న రాయలసీమ, ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖ ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. వాకాడులో 40మీటర్లు, కోటలో 20మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పంబలి, శ్రీనివాససత్రం, కాకివాకం తదితర తీరప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.