Cyclone Montha: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు..!
ఏపీలో మొంథా తుపాను ప్రభావం మొదలైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న తుపాను ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఉన్న పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. రేపు ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరానికి చేరువవుతున్న కొద్దీ తుపాను వేగం పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల్ని అన్నివిధాలుగా అప్రమత్తం చేస్తోంది. అదే సమయంలో సచివాలయ ఉద్యోగులకు అలర్ట్ ఇచ్చింది.
మొంథా తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అన్ని సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. తుపాను ప్రభావం నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సెలవులు ఇచ్చే పరిస్ధితి లేదని, వారంతా కలెక్టర్ల ఆదేశాలు, సూచనల మేరకు పనిచేయాలని డైరెక్టర్ తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.

దీంతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకూ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవల్ని వినియోగించుకోవాలని, ఈ మేరకు వారు జారీ చేసే అదేశాల్ని సిబ్బంది పాటిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతీ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కలెక్టర్లకు, ఇతర సచివాలయ అధికారులకు అందుబాటులో ఉండి తుపాను ప్రభావం ప్రజలపై పడకుండా సాధ్యమైనంత మేర చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే తుపాన్ ప్రభావం మొదలైన నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కూడా కలెక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. తుపాను సహాయక శిబిరాల ఏర్పాటు, జనం తరలింపు, వారికి ఆహారం, ఇతర నిత్యవసరాలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేలా వారికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో క్షేత్రస్ధాయిలో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications