జగన్..మోదీ నిన్ను కూడా మింగేస్తాడు జాగ్రత్త : నారాయణ హెచ్చరిక..!!
బీజేపీ..ఆరెస్సెస్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య లౌకిక - వామపక్ష శక్తలను ఏకం చేస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. సీపీఐ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా విజయవాడ లో కామ్రేడ్లు కదం తొక్కారు. నగరం ఎరుపుమయం అయింది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని రాజా చెప్పుకొచ్చారు. పార్టీ బహిరంగ సభలో డీ రాజా కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామిక, మానవ హక్కులు హరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ పై నారాయణ వ్యాఖ్యలు
ఒకే సంస్కృతి పేరుతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే నక్సలైట్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులు, ద్రోశద్రోహులనే ముద్ర వేసి జైళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ జాతీయ కార్యదర్శి ఏపీ ముఖ్యమంత్రి జగన్ - ప్రధాని మోదీ రాజకీయ సంబంధాల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నారాయణ ప్రధాని మోదీతో సీఎం జగన్ పెళ్లి కాని కాపురం (లివింగ్ టుగెదర్) చేస్తున్నారని కామెంట్ చేసారు.

మోదీ మింగేస్తారు..జాగ్రత్త
జగన్.. మోదీ నిన్ను కూడా మింగేస్తాడు జాగ్రత్త..అని నారాయణ హెచ్చరించారు. బీజేపీతో సన్నిహితంగా ఉండే పార్టీలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ల్యాండ్, లిక్కర్ మాఫియాలను ప్రోత్సహించేవారికి వ్యతిరేకంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశంలో 29మంది ఆర్థిక గూండాలు పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వారిలో 25 మంది గుజరాత్కు చెందినవారేనని విమర్శించారు. అదాని ఓ స్మగ్లర్ అని, ప్రధాని మోదీ సహకారంతో ఆయన ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానానికి చేరిపోయారన్నారు. బీజేపీ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని గద్దె దించేందుకు ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలసి పోరాడతామని చెప్పారు.

ఎరుపెక్కిన బెజవాడ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కళాకారులు వేదిక ముందు పూలతో బతుకమ్మను తయారు చేసి కోలాటం ఆడుతూ పాటలు పాడుతుండగా వారితో జత కలిశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు చేరుకొని కదం తొక్కారు. ఆటపాటలతో కార్యకర్తలను ఉర్రూతలూగించారు. బెజవాడలో నిర్వహించిన ర్యాలీకి రాజా..నారాయణ నాయకత్వం వహించారు. ఈ మహాసభలకు బంగ్లాదేశ్, చైనా, క్యూబా, ఫ్రాన్స్, గ్రీస్, కొరియా, లావోస్, నేపాల్, పాలస్తీనా, పోర్చుగల్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, అమెరికా, వియత్నాం దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications