రాలేకపోతున్నా: ఈడికి జగన్ వినతి, ఢిల్లీ పర్యటన వాయిదా
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
కేవలం ఈ ఒక్క పని కోసమే ఢిల్లీ వస్తే బాగుండదని, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను కూడా కలిసి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడాలని జగన్ అనుకున్నట్లు సమాచారం.
కానీ, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తమే ప్రధానంగా ఢిల్లీ వస్తున్నట్లు వార్తలు రావడంతోనే జగన్ వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అనివార్య కారణాల వల్లే ఢిల్లీకి రాలేకపోతున్నానని, హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇస్తానని ఈడీ వర్గాలకు జగన్ చెప్పినట్లు సమాచారం.
అవసరమైతే ఢిల్లీ వస్తానని కూడా చెప్పినట్లు తెలిసింది. దీనికి ఢిల్లీలోని ఈడీ వర్గాలు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలావుండగా, ముందుగానే అరవింద్ పనగారియా వద్ద జగన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు.