చంద్రబాబు దిగజారి వ్యాఖ్యలు చేయిస్తున్నాడు; నాలుక చీరేస్తాం: దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ ఫైర్
తూర్పు గోదావరి జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై విచారణ జరిపించాలని టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆయన పై విరుచుకు పడుతున్నారు. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్ లు టిడిపి నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
Recommended Video

బండారు సత్యన్నారాయణ ఒక బడుద్దాయి : దాడిశెట్టి రాజా
సీఎం పెట్టుబడుల గురించి ఒత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతమ్ రెడ్డి గుండె నొప్పికి గురయ్యారని, దీనిపై విచారణ జరగాలని బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను దాడిశెట్టి రాజా ఖండించారు. ఇక ఇదే సమయంలో తీవ్రపదజాలంతో వారిపై విరుచుకు పడ్డారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్దాయి అని, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడని దాడిశెట్టి రాజా విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చెయ్యమన్నాడా? దాడిశెట్టి రాజా
తెలుగుదేశం పార్టీ నేతలు శవాల దగ్గర నెత్తురు కూడు తినే సన్నాసులు అంటూ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తాడు, బొంగరం లేదని, టిడిపిలో బండారు వంటి లుచ్చా నాయకులు ఎక్కువగా ఉన్నారని దాడిశెట్టి రాజా తిట్టిపోశారు. గుండె నొప్పికి గురై అకాల మరణం చెందిన వివాదరహితుడిగా గౌతమ్ రెడ్డి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా అంటూ దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబును సైతం టార్గెట్ చేశారు. బండారు నిన్ను వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా అంటూ దాడిశెట్టి రాజా ప్రశ్నాస్త్రాలు సంధించారు.

యనమల ఓ ముసలోడు.. సత్తా లేక పక్క జిల్లా నాయకులతో మీటింగ్ పెట్టాడు
ఇక ఇదే సమయంలో యనమల రామకృష్ణుడును సైతం టార్గెట్ చేసిన దాడిశెట్టి రాజా యనమలలో సత్తా లేక పక్క జిల్లాలోని పత్తాలేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నాడని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు అని, ఆయన పనైపోయిందని పేర్కొన్నారు. ఆ ముసలోడు యువత కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కూడా రాజకీయం చేయాలని టిడిపి నాయకులు చూస్తున్నారని దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు.

నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తా : గుడివాడ అమర్నాథ్
ఇక ఇదే సమయంలో టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా వాగుతున్నారు అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తా అని హెచ్చరికలు జారీ చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో తమ పార్టీతో పాటు రాష్ట్రం అంతా విషాదంలో నిండి పోయిందని, ఇటువంటి సమయంలో ఇంతగా దిగజారి తాగుబోతు మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు.

చంద్రబాబు దిగజారి వ్యాఖ్యలు చేయిస్తున్నారు: గుడివాడ అమర్నాథ్
చంద్రబాబు తమ నాయకులను మరీ ఇంత నీచంగా మద్యం తాగించి మాట్లాడించడం బాధాకరమని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. టిడిపి దిగజారుడు తనానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు తక్షణమే ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని గుడివాడ అమర్నాథ్ హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications