దమ్ముంటే కొట్టితరమండి, విడదీయొద్దు: దాసరి, చిరుతో భేటీకానున్న ముద్రగడ
అమరావతి: కాపులకు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరింత ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఆదివారం కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. సర్కారుపై ఏ విధంగా పోరాటం సాగించాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశానికి కాపు నేత ముద్రగడ పద్మనాభం హాజరై, తన భవిష్యత్ కార్యాచరణ గురించి నేతలకు వివరించనున్నారు.

ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సమాచారం. కాగా, కాపు నేతలు, మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవిలతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో కాపు జేఏసీ కమిటీ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కాపులతో పాటు తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలంటూ, కాపు నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సమావేశంలో సర్కారుపై ఏ విధంగా పోరాడాలి. ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు సాగించాలన్న అంశాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది.
దమ్ముంటే కొట్టి తరమండి: ముద్రగడ హెచ్చరిక
కాపు సామాజిక వర్గానికి న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి ఎవరైనా నేతను ముందుండి నిలిపితే తాను పక్కకు తప్పుకుంటానని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. తనను కాపు జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
'దమ్మూ, ధైర్యం ఉంటే, చేతనైతే తునిలాంటి మీటింగ్ పెట్టి నన్ను తరిమి కొట్టించండి. అప్పుడు మీ సత్తా చూపినట్లవుతుంది. అంతే తప్ప, ముద్రగడ కాపు ద్రోహి. కాపుల్లో చెడబుట్టాడని తప్పుడు మాటలు చెప్పించొద్దు ముఖ్యమంత్రి గారూ... ఒక్క అడుగు కూడా నేను వెనక్కు వేయను. ఇంటి వరండాలో కూర్చుంటాను. ఎంతమందితో కొట్టిస్తావో కొట్టించు. చెప్పులతో కొట్టాస్తారో... రాళ్లతో కొట్టిస్తారో మీ ఇష్టం' అంటూ ముద్రగడ ధ్వజమెత్తారు.
అంతేగాక, 'ఉన్నపళంగా ఆస్తి, అప్పులు వదిలేసి పోతాను. కానీ, మా సోదరులతో తప్పుడు ఆరోపణలు చేయించి, మా మధ్య తగవులు పెట్టకండి. ఇప్పటికే గ్రామాల్లో మూడేసి, నాలుగేసి గ్రూపులు తయారయ్యాయి. సిగ్గుమాలిన పని ఇది. మీ బతుకు కోసం, మీ కుర్చీని కాపాడుకునేందుకు మా జాతిని విడదీయ వద్దు. తప్పిది.. క్షమించరాని నేరమని తెలియజేస్తున్నా' అంటూ ముద్రగడ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆదివారం ఉదయం కాపు ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వేధింపుల్లో భాగంగానే తమ కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్యానంతరం కాపులపై ఉగ్రవాదుల కోసం తయారు చేసిన టాడా చట్టాన్ని ప్రయోగించాలని కూడా చూశారని ఆరోపించారు.
కాపులకు న్యాయం చేస్తానన్న చంద్రబాబునాయుడు, తన హామీని వెంటనే నెరవేర్చుకుంటే, మరోసారి దీక్ష చేపడతానని కాపు నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యతని అన్నారు.
కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం తదుపరి ఎలాంటి కార్యాచరణకు దిగాలన్న విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపిన ఆయన, తన రోజువారీ కార్యక్రమాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు. తన ఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు. అయితే, బెదిరింపు ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తుండటం మంచిది కాదని, దీనివల్ల సమస్యలు పెరుగుతాయని అన్నారు.












Click it and Unblock the Notifications