రేపు ముద్రగడ ఇంటికి దాసరి: 1500 మంది టిడిపికి రాజీనామా, 'ప్రభుత్వాన్ని కూల్చేస్తాం'
చిత్తూరు: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు దర్శకరత్న దాసరి నారాయణ రావు మద్దతు పలికారు. సోమవారం నాడు ఆయన కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. ముద్రగడ దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే.
ముద్రగడ దీక్షకు మద్దతుగా 1500 మంది టిడిపికి రాజీనామా
ముద్రగడ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆ దీక్షకు సంఘీబావంగా 1500 మంది టిడిపికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరుతామని వారు చెప్పారని తెలుస్తోంది.
బీసీ సంఘాల హెచ్చరిక
ఓ వైపు కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ముద్రగడ పద్మనాభం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పతిప్తాడు మండలంలోని ఆయన సొంతూరు కిర్లంపూడిలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో కాపులకు రిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక రంగంలోకి దిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్ని కలిసి 'రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక' పేరిట ఏకమయ్యాయి. వేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది.
ఈ సందర్భంగా వేదిక నేతలు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ది చెందిన కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వాన్ని కూలదోస్తామని కూడా వారు హెచ్చరించారు.