మా నాయకుడు కాదు కానీ: కిరణ్పై దామోదర ఆగ్రహం
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దామోదర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అంశంపై స్పందించారు. ముఖ్యమంత్రి వ్యూహాలను, కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పి కొడతామన్నారు.
బలిదానాలతో కూడిన ఉద్యమాలకు చరమ గీతం పాడుతామన్నారు. కిరణ్ ఓ ప్రాంతానికి సిఎం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికన్నారు. కిరణ్ ఓ ప్రాంతం పైనే ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. కిరణ్ తెలంగాణ ప్రాంతంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కిరణ్ను తాము తమ నాయకుడిగా భావించడం లేదన్నారు.
కాంగ్రెసు పార్టీలో ఉన్నందున తాము కిరణ్ నాయకత్వంలో ఉన్నామన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మరోసారి గడువు పెంచే కుట్రలు చేస్తున్నారన్నారు. బిల్లుపై ఇప్పుడు గడువు పెంచినా చర్చించకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు. బిల్లుపై చర్చకు గడువు పెంచమని కోరడం ద్వారా తెలంగాణను అడ్డుకోవచ్చునని భావిస్తున్నారని, వాటిని తాము తిప్పి కొడతామన్నారు.
దిగ్విజయ్తో జానారెడ్డి భేటీ
మరోవైపు ముఖ్యమంత్రి సభాపతికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివరించారు.