సిఎం హామీని బట్టి కమిటీ నిర్ణయం: సమ్మెపై అశోక్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రపై ఇచ్చే హామీని బట్టి తాము వేసే కమిటీ సమ్మెను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర విభజనపై శానససభ్యులు రాజీ పడినా తాము రాజీకి రాబోమని ఆయన అన్నారు. ఎపి ఎన్జీవోల సంఘం కార్యవర్గ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజనను ఏ స్థాయిలోనైనా ఆపడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు.
సమ్మె వల్ల ఏర్పడిన ఇబ్బందులను మరి కొన్నాళ్లు భరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్యోగులకు సూచించారు. ఎపిఎన్జీవోలుగా సమ్మెను కొనసాగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. రేపు గురువారం జెఎసి సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చే హామీని బట్టి సమ్మెపై నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రితో చర్చలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీని వేస్తామని, ఆ కమిటి అప్పటికప్పుడు సమ్మెపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. జెఎసి నిర్ణయం మేరకే ఎపి ఎన్జీవోలు నడుచుకుంటారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనే విషయంపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందా, ఒక్కసారి వస్తుందా అనే విషయంపై అయోమయం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీకి తీర్మానం వచ్చే విషయంపైనే ముఖ్యమంత్రితో చర్చలు ఉంటాయని ఆయన చెప్పారు.
దగ్గుబాటి పురంధేశ్వరి వంటి కేంద్ర మంత్రులు విభజనకు అనుకూలంగా మాట్లాడడాన్ని ఆయన తప్పు పట్టారు. వారి ప్రకటనలు సీమాంధ్ర ప్రజలను మానసికంగా బలహీనపరిచే విధంగా ఉన్నాయని, అటువంటి వ్యాఖ్యలు సరి కాదని ఆయన అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల లాభం లేదని అన్నామే తప్పు రాజీనామాలు చేయకూడదని తాము అనలేదని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులపై, కేంద్ర మంత్రులపై రాజీనామాల కోసం ఒత్తిడి పెడుతామని, తాము కొంత మందిమి దానికోసం ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి ఎంపీలపై కన్నా ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని ఆయన అన్నారు. శాసనసభలో విభజన తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం శాసనసభ్యులకు ఉందని ఆయన అన్నారు. తీర్మానాన్ని ఓడిస్తామని సీమాంధ్ర శాసనసభ్యులు చెబుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications