17, 18 తేదీల్లో పార్టీపై: రాయపాటి, తలనీలాలు: కాసు
హైదరాబాద్: ఈ నెల 17, 18 తేదీల్లో కొత్త పార్టీ పెట్టే విషయంపై నిర్ణయం జరుగుతుందని గుంటూరు పార్లెమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెసు రెండు, మూడు సీట్లు మాత్రమే వస్తాయని ఆయన శనివారం గుంటూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసు భూస్థాపితం అవుతుందని ఆయన అన్నారు. నూటికి తొంబై శాతం తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందదని ఆయన అభిప్రాయపడ్డారు.
తలనీలాలు ఇచ్చుకుంటా: కాసు
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పదవీ త్యాగానికి సిద్ధపడ్డా కేంద్రంలో చలనం లేదని మంత్రి కాసు కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం కిరణ్ భేటీ కానున్నట్లు ఆయన తెలిపారు. రేపే రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి కాసు ప్రకటించారు. రాష్ట్ర విభజన ఆగిపోతే కాలి నడకన వెళ్లి కోటప్పకొండకు తలనీలాలు సమర్పించుకుంటానని ఆయన అన్నారు.

మూడు రోజుల తర్వాత: గంటా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజుల తర్వాత రాజీనామా చేస్తారని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని అంటున్నారని, మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన శనివారం విశాఖపట్నంలో చెప్పారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మిగతా అందరం రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు.
పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ సరైంది కాదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి బిల్లును ఎలా ప్రవేశపెడతారని ఆయన అడిగారు. పార్లమెంటులో గందరగోళానికి పాల్పడినవారందరినీ సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై సోమవారం స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. తాము రేపు ముఖ్యమంత్రితో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.
పార్టీలోనే ఉంటా: తోట నరసింహం
రాష్ట్ర విభజన జరిగినా తాను పార్టీలోనే ఉంటానని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి తోట నరసింహం అన్నారు. విభజన జరగదనే తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త పార్టీ ఆలోచన లేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ దురదృష్టకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications