రేపు విజయవాడకు ఢిల్లీ, కేరళ సీఎంలు కేజ్రివాల్, పినరయి విజయన్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్ రేపు విజయవాడ రానున్నారు. ఢిల్లీ నుంచి కేజ్రివాల్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు రానుండగా.. కేరళ నుంచి విజయన్ కూడా ఇదే ఎయిర్ పోర్టుకు రాబోతున్నారు. అయితే వీరి రాక వెనుక ఓ కీలక కారణముంది.
రేపు తెలంగాణలోని ఖమ్మంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రావాలని కేజ్రివాల్ తో పాటు విజయన్ కు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందులో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం వెళ్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగి హెలికాప్టర్లో ఖమ్మం చేరుకుంటారు. సభ అనంతరం ఇద్దరు సీఎంలూ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. ఇక్కడి నుంచి ఎవరి రాష్ట్రాలకు వారు విమానంలో వెళ్తారు.

బీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న కేసీఆర్ .. ఇప్పటికే బీజేపీతో పోరాడుతున్న ఇద్దరు సీఎంలు కేజ్రివాల్, విజయన్ లను ఖమ్మం సభకు ఆహ్వానించారు. వీరిద్దరిని భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే జాతీయ కూటమిలో తమతో పాటు కలిసి పనిచేయాలని కేసీఆర్ కోరబోతున్నారు. ఇప్పటికే జాతీయస్ధాయిలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో మోడీ సర్కార్ వరుస విజయాలు సాధిస్తోందని భావిస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఏర్పాటు దానికి ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications