రెచ్చగొట్టే రాజకీయాలొద్దు: దేవినేని, అందుకే జగన్ ఆటలు సాగనివ్వలేదన్న గాలి
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధానిని నిర్మించుకుంటున్నామనే ఆనందంతో ప్రజలుంటే జగన్ రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని, అది మానుకోవాలని హితవు పలికారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, వనమాడి వెంకటేశ్వరరావు, పులపర్తి నారాయణమూర్తి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని ప్రాంతం మల్కాపురంలో చెరుకుతోట దగ్ధం వెనక ప్రభుత్వ కుట్ర ఉందని జగన్ ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న వ్యక్తులకే ఇటువంటి ఆలోచనలొస్తాయని జగన్ను ఉద్దేశించి దేవినేని ధ్వజమెత్తారు. గోదావరి జిల్లాలకు రెండో పంటకు నీరిస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి పోలవరం పనులను వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు.
జగన్ 10 లక్షల ఎకరాలు లాక్కునేవారు: ముద్దుకృష్ణమ
లేపాక్షి నాలెడ్జ్హబ్ కోసం 15వేల ఎకరాలు, వాన్పిక్ కోసం 27వేల ఎకరాలు, చెల్లెలు కోసం 1.50లక్షల ఎకరాల బయ్యారం గనులు, బ్రహ్మణి ఉక్కు కర్మాగారం కోసం 14వేల ఎకరాలు.. ఇలా మొత్తం 2.80లక్షల ఎకరాలు రైతుల నుంచి తన తండ్రి హయాంలో జగన్మోహన్రెడ్డి లాక్కున్నారని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.
ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ అధికారంలోకి వస్తే 10లక్షల ఎకరాలు లాక్కుని.. రూ.10లక్షల కోట్లు సంపాదించాలని ప్రణాళిక వేసుకున్నారని ఆరోపించారు. తెలివైన ప్రజలు.. జగన్ ఆటలు, దురుద్దేశపు ప్రణాళికలు సాగనివ్వలేదని అన్నారు.