ప్రాజెక్టులు మావి..పేరు మీదా .. ప్రతిపక్షాలను తిట్టటం తప్ప ఆ మంత్రికి వేరే పనుందా:దేవినేని ఉమా ఫైర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు స్వర్ణయుగమని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తమ ప్రాజెక్టులుగా వైసిపి ప్రభుత్వం చెప్పుకుంటుందని దేవినేని ఉమ మండిపడ్డారు.
టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్ట్ లపై వైసీపీ డబ్బా
ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానమివ్వాలని పేర్కొన్న దేవినేని ఉమా ఏ ప్రాజెక్టులకు ఎంత కేటాయించారు అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖలో 63,373 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, చివరి ఏడాది కూడా 13,988 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని దేవినేని ఉమా పేర్కొన్నారు. టిడిపి హయాంలో ప్రారంభించిన 62 ప్రాజెక్టులలో ఇరవై మూడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని పేర్కొన్న ఉమా ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నదని ఆరోపించారు.
పట్టిసీమను ఒట్టి సీమన్నారు.. అదే గతయ్యింది
వైసీపీ అధికారంలోకి వచ్చిన 12 నెలలలో పనులన్నింటినీ రద్దు చేశారని తప్పుపట్టిన ఉమా వైసిపి నేతలు పట్టిసీమ ఒట్టిసీమ అని విమర్శించారని, ఇప్పుడు అదే పట్టిసీమ గత అయిందని పేర్కొన్నారు. గోదావరి పెన్నా అనుసంధానం ఎందుకు ఆలస్యం చేశారు అంటూ ప్రశ్నించారు దేవినేని ఉమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్నా గోదావరి, చింతలపూడి, సుజల స్రవంతి ,వంశధార నాగావళి, వెలిగొండ తదితర ప్రాజెక్టులన్నీ టిడిపి హయాంలోనే ప్రారంభమయ్యాయని దేవినేని ఉమా పేర్కొన్నారు.
జలవనరుల శాఖా మంత్రికి వచ్చింది అదే
ఇక తాము చేసిన పనులను కూడా మీ ఘనకార్యంగా చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని దేవినేని ఉమా ప్రశ్నించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షాలను తిట్టడం తప్పా జలవనరుల శాఖ మంత్రి గా చేసిన పని ఏమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. విపక్ష నేతలను, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం తప్ప, వైసిపి ప్రభుత్వానికి ఇంకేం తెలుసని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో ప్రారంభించిన 62 ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తమ ప్రాజెక్టులుగా చెప్పుకుంటూ వైసిపి ప్రభుత్వం తమ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.