కనక దుర్గమ్మ ఆలయం భవానీల మయం
Vijayawada Kanaka Durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వందలాది మంది అమ్మవారిని దర్శించుకుంటోన్నారు. భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలుస్తోన్నారు. పూజలను నిర్వహిస్తోన్నారు. భవానీ మాల దీక్షను విరమిస్తోన్నారు.
భవానీ మాల దీక్షల విరమణకు నేడు ఆరంభం కావడమే దీనికి కారణం. బుధవారం వరకు అంటే ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచీ మాల ధారణ చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని దీక్షలను విరమిస్తారు ఈ అయిదు రోజుల పాటు.

ఈ తెల్లవారు జాము నుంచే భవానీ దీక్షాధారులు అమ్మవారికి ఆలయానికి చేరుకోవడం మొదలు పెట్టారు. తెల్లవారే సరికి పెద్ద ఎత్తున క్యూ ఏర్పడింది. ఆలయ ప్రాంగణం మొత్తం దీక్షాధారులతో నిండిపోయింది. వారాంతపు రోజు కావడం వల్ల కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే సాధారణ భక్తుల సంఖ్య కూడా భారీగా ఉంటోంది.
ఈ అయిదు రోజుల్లో ఆరు నుంచి ఏడు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తారని, అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అమ్మవారి దర్శనం భాగ్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకున్నారు.
లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాల పంపిణీల్లో ఎలాంటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. రద్దీని నివారించడానికి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టారు. వెయింటిగ్ హాళ్లల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను పార్క్ చేయడానికి అవసరమైన స్థలాలపై ముందుగానే సమాచారం ఇచ్చారు.
దేవీ నవరాత్రుల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు ఆలయ అధికారులు. రోజువారీ పూజల్లో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించడానికి ప్రత్యేకంగా మూడు హోమ గుండాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే- సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ వద్ద మొత్తం 800 వరకు షవర్లు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications