అనంతపురం కోర్టుది తప్పుడు వారెంట్: ధోనీని అరెస్ట్ చేయాలనడంపై లాయర్
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు తీర్పు పైన భారత వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరఫు న్యాయవాది శుక్రవారం స్పందించారు. ధోనీ పైన కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పుడుదని అతని న్యాయవాది రజనీశ్ చోప్రా చెప్పారు.
2013లో బిజినెస్ టుడే లో ధోనీని విష్ణుమూర్తి అవతారంలో వేసిన పత్రిక ఫోటోలో ధోనీ చేతిలో ఓ పాదరక్షను ఉంచింది. దీనిపై అప్పటి విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ ధోనీపై అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు.
దీనిపై విచారణ జరుగుతోంది. విచారణకు ధోనీ హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతపురం కోర్టు వచ్చే నెల 25న ధోనీ వ్యక్తిగతంగా హాజరు కావాలని, లేకుంటే అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.
దీనిపై ధోనీ లాయర్ రజనీశ్ చోప్రా మాట్లాడారు. తమకు న్యాయస్ధానం నుంచి ఎలాంటి సమన్లు అందలేదన్నారు. అలాంటప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. ధోనీ న్యాయవ్యవస్థను గౌరవిస్తారని చెప్పారు. అయితే, వ్యక్తిగతంగా ధోనీ ఎప్పుడు సమన్లు అందుకోలేదన్నారు. కాబట్టి ఈ తీర్పు సరికాదన్నారు.