టీడీపీలో బయటపడ్డ విభేదాలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఆ పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి. మన్యం జిల్లా,పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటకొచ్చాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ నేతలంతా తీర్మానం చేశారు.ఈ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు బుధవారం మీడియాకు నియోజకవర్గ నేతలు వెల్లడించారు.
ఎన్నికలకు ముందు టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జిగా బోనెల విజయచంద్రను పార్టీ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు బయడపడ్డాయి.పార్టీ అధికారంలోకి రావడంతో నేతల మధ్య అధిపత్యపోరు మొదలైంది. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్లను విజయచంద్ర కలుపుకొని వెళ్లకుండా పూర్తిగా పక్కన పెట్టేశారని, సీనియర్లన్న గౌరవం లేకుండా వ్యవహరించేవారన్న విమర్శలు బలంగా వినిపించాయి.

మరోవైపు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గ టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. దీంతో పార్వతీపురం పట్టణంలో మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ద్వారపురెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే చిరంజీవులును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తామంతా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. మరి దీనిపై పార్టీ అధిష్టానంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications