కిరణ్ రెడ్డితో నేను మాట్లాడుతా: కొత్త పార్టీపై దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం స్పందించారు. కొత్త పార్టీ పెట్టవద్దని తాను కిరణ్ కుమార్ రెడ్డికి చెబుతానని అన్నారు. తాను కిరణ్తో ఈ విషయం మాట్లాడుతానని వ్యాఖ్యానించారు. వార్ రూంలో మీటింగ్ జరిగింది. ఈ భేటీ సమయంలో డిగ్గీ నేతలతో పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డితో అధిష్టానం టచ్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని నేతలు ప్రశ్నించారు. దానికి స్పందించిన డిగ్గీ... రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. తద్వారా పరోక్షంగా కిరణ్తో టచ్లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం విషయమై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సస్పెన్స్కు త్వరలో తెర పడుతుందని దిగ్విజయ్ తెలిపారు. సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రపతి పాలన ఉంటుందా? ప్రభుత్వం ఏర్పాటవుతుందా? అన్నది త్వరలోనే తెలియజేస్తానన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచిన సీమాంధ్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను పరిష్కరించేందుకు వారు చాలా మంచి సూచనలు చేశారని తెలిపారు. విభజనపై టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని, తెలంగాణకు మద్దతు ఇస్తామని లిఖితపూర్వకంగా తెలిపి, తర్వాత వెనక్కు మళ్లాయని మండిపడ్డారు. కాంగ్రెస్ తానిచ్చిన హామీపై వెనక్కు పోలేదని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలుపుకొన్నామని తెలిపారు.