అసెంబ్లీ లాబీల్లో చర్చ: ఫేజ్-2లో జగన్కు మరో 10 మంది షాక్ ఇవ్వనున్నారా?
హైదరాబాద్: ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్-2'పై అసెంబ్లీ లాబీల్లో సైతం హాట్ టాపిక్గా మారాయని తెలుస్తోంది. సీనియర్ నేత, వైసీపీ శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, మరో వైసీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఇంకా ఎవరెవరు టీడీపీలోకి వస్తున్నారన్న చర్చ సోమవారం అసెంబ్లీ లాబీల్లో జోరుగా సాగింది.
అగ్రిగోల్డ్ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షం నినాదాలు చేయడంతో సోమవారం ఉదయం అసెంబ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువసేపు లాబీల్లోనే గడిపారు. ఈ సందర్భంగా కోస్తా, రాయలసీమకు చెందిన సుమారు పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీతో టచ్లో ఉన్నట్లు సమాచారం.
దీనిపై పెద్దఎత్తున చర్చ నడిచినట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అసెంబ్లీకి వచ్చి కొద్దిసేపు లాబీల్లో గడిపారు. ఆ సమయంలో కోస్తా ప్రాంతానికి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి ఆయన పక్కన కూర్చుని కాసేపు మాట్లాడారు. మీ జిల్లా నుంచి ఎవరైనా మా పక్కకు వస్తున్నారా? అని రమేష్ ఆయన్ను ఆరా తీశారు.
ఇందుకు ఆ వైసీపీ ఎమ్మెల్యే స్పందిస్తూ మా జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా కొందరి పేర్లు వినిపించినట్లు ఆయన బదులిచ్చారంట. ఆయన తర్వాత రాయలసీమ జిల్లాలకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే వచ్చి రమేష్తో మాట్లాడారు. వారిద్దరి మధ్య కూడా వలసల అంశం చర్చకు వచ్చిందని తెలుస్తోంది.
'ఏమోనబ్బా...ఎవర్ని చూసినా పోతారనే అంటున్నారు. ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్ధమే కావడం లేదు' అంటూ ఆ ఎమ్మెల్యే.. సీఎం రమేష్తో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో భోజనాల సమయంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఒకేచోట భోజనాలు చేశారు.
ఆ సమయంలో ఓ వైసీపీ ఎమ్మెల్యేని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ వద్దకు పిలిచారు. 'అసలే రోజులు బాగోలేదు. ఇప్పుడు మీ పక్కన కూర్చుని భోజనం చేస్తే రేపటి నుంచి నన్ను మీ పార్టీ లెక్కలో వేసేస్తారు. తర్వాత కలుద్దాంలే' అని ఆయన నవ్వుతూ బదులిచ్చారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఓ టీడీపీ ఎమ్మెల్సీ వారితో కలిశారు. ఆ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారం వారి మధ్య చర్చకు వచ్చింది.
ఆ ఎమ్మెల్యేను తీసుకొంటే తనకు ఏ అభ్యంతరం లేదని పార్టీ అధినేతకు చెప్పానని టీడీపీ ఎమ్మెల్సీ తెలిపారు. 'ఆ ఎమ్మెల్యే వస్తే నీకు పోటీ కాదా' అని ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'బయట ఉంటే పోటీ. మన ఇంట్లోకి వస్తే ఇక పోటీ ఏముంది? నియోజకవర్గాలు పెరుగుతున్నాయి.
ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయడం పెద్ద సమస్య కాదు' అని ఆయన బదులిచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎంపీ కూడా సోమవారం అసెంబ్లీ లాబీకి వచ్చారు. నియోజకవర్గాలు పెరుగబోతున్న మాట నిజమేనా అని కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను అడగడంతో నిజమేనని ఆయన బదులిచ్చారు.