వైసీపీ విజయంలో మరోపాత్ర దివ్యా రెడ్డి..ఎవరామె..ఏమా కథ..?
ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ పార్టీ ఘనవిజయం వెనక ఎంతో మంది కృషి, కష్టం దాగి ఉంది.ముందుగా పాదయాత్రతో వైసీపీ అధినేత ప్రజల మనసులను గెలువగా.. వైసీపీని వెనకుండి తన వ్యూహాలతో నడిపించారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్తో పాటు చాలామందికి ఈ విజయంలో భాగం ఉంది. ఇక సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందనే చెప్పాలి. వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ సాధించడం వెనక ఓ మహిళ ఉన్నారు. వైసీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఆమె సోషల్ మీడియా ద్వారా మూరుమూల ప్రజలకు కూడా చేరవేయగలిగారు. ఆమె పేరే దివ్యా రెడ్డి. ఇంతకీ ఈ దివ్యా రెడ్డి ఎవరు..?
దివ్యారెడ్డి.. వైసీపీ అధినేత జగన్ మేనత్త విమలమ్మ కూతురు. వైసీపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంలో సోషల్ మీడియా కూడా తన వంతు పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. టీడీపీ సోషల్ మీడియాలో ఎలాగైతే వైసీపీని టార్గెట్ చేసిందో ... అదే స్థాయిలో వైసీపీ కూడా టీడీపీ ఆరోపణలను సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టింది. వీటన్నిటినీ ప్లాన్ చేసి డిజిటల్ మీడియాను వెనకుండి నడిపించారు దివ్యారెడ్డి. దివ్యా రెడ్డి ఓ ప్రముఖ ఎంఎన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేశారు. అయితే ఆమెకు టెక్నాలజీపై మంచి పట్టుండటంతో వైసీపీ నాయకత్వం పార్టీకోసం ఆమె సేవలను వినియోగించుకోవాలని భావించారు. అడిగిన వెంటనే కాదనకుండా దివ్యారెడ్డి వైసీపీ కోసం పనిచేసేందుకు అంగీకారం తెలిపారు.
ఇక వైసీపీ డిజిటల్ మీడియాలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేలను కొన్నారంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆతర్వాత ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్యాకేజీతో రాజీ పడ్డారంటూ విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్లోకి ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు దివ్యారెడ్డి. వైసీపీకి ఎక్కడ ప్లస్ అవుతుంది ఎక్కడ నెగిటివ్ అవుతోందనేది పసిగట్టి దానికనుగుణంగా ఆమె కంటెంట్ ప్లాన్ చేశారు. ఇక అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా వాలంటీర్లను నియమించి ఎప్పటికప్పుడు ఆ జిల్లాలోని పరిస్థితులపై సమీక్ష చేసి నివేదిక తెప్పించుకునేవారు. ఇలా మీడియాకు సోషల్ మీడియాకు వారధిగా నిలిచారు దివ్యారెడ్డి.
ఇక న్యూట్రల్ ఓటర్లు చాలామంది వైసీపీ వైపు మొగ్గు చూపారంటే అందుకు కారణం సోషల్ మీడియానే అని చెప్పాలి. టీడీపీ ప్రభుత్వంలో లోటుపాట్లను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరేలా దివ్యారెడ్డి ప్లాన్ చేసేవారు. ఇక ఎన్నికలకు చివరి ఆరు నెలల సమయంలో దివ్యారెడ్డి బృందం రాత్రింబవళ్లు పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం కొందరిని అరెస్టు చేసినప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వ పథకాలు, జన్మభూమి కమిటీల దౌర్జన్యం, మాజీ ఎమ్మెల్యే చింతమనేని దాడులు, బొండా ఉమా చేసిన దాడులు వీటన్నిటినీ ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు దివ్యారెడ్డి. సోషల్ మీడియా అస్త్రంగా టీడీపీ అరాచకాలను ఎండగట్టారు కాబట్టే చాలామంది ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపి ఉంటారనే అభిప్రాయంను చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.