సారీ చెప్పాలని అరుణ, కేసీఆర్కి ఫ్రీ కరెంట్ ఇచ్చామని
మహబూబ్ నగర్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుల రక్తాన్ని కళ్ల చూస్తున్నారని, ఆయన రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డీకే అరుణ మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతుల, సామాన్య ప్రజల ఆశలు నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విదేశీ పర్యటనలతో కాలాయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాదులో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యలు మాట్లాడారు. తెరాస కారణంగా హైదరాబాదుకు పెట్టుబడులు ఆగిపోతాయని జైపాల్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీకీ భవిష్యత్తు లేదన్నారు. బీజేపీతో కలిసేందుకు కేసీఆర్కు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అమిత్ షా కనుసన్నుల్లో మోడీ పని చేస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకు వస్తానని చెప్పిన కేంద్రం తీసుకు రాలేదని ఆరోపించారు. వంద రోజుల్లో తానేం చేయలేదని కేసీఆరే చెప్పారని పొన్నాల అన్నారు. కాంగ్రెసు పార్టీ పదేళ్లలో ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని.. తన ఫాం హౌస్కు ఉచితంగా విద్యుత్ వాడుకున్న విషయం ఆయనకు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. లక్షల మంది రుణాలు మాఫీ చేశామన్నారు. రైతుల సమస్యల పైన కాంగ్రెస్ ధర్నాలు విజయవంతమయ్యాయన్నారు.












Click it and Unblock the Notifications